అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే మహోన్నత వ్యక్తి ఆయన అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే యావత్ తెలంగాణ ప్రజానీకం గులాబీ జెండాకు పబ్బతి పడుతున్నదని తెలిపారు. మంగళవారం కేతేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంత్రితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
గతంలో ఒక్కపూట కూడా తిండి లేక ఇబ్బందులు పడ్డ పేద కుటుంబాలు నేడు కడుపు నిండా తింటున్నాయని పేర్కొన్నారు. దేశంలో వరిని పండిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని, 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో నల్లగొండ జిల్లా రికార్డు సాధించిందని చెప్పారు. భారత రాజకీయాల్లో కేసీఆర్ అవసరం ఉందని, మన పథకాలను దేశ ప్రజలకు అందించేందుకే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. సామాన్యుల నడ్డివిరుస్తూ కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే లాభం చేకూరేలా మోదీ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారిందని, రాహుల్గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేసినా నోరెత్తి మాట్లాడలేని దుస్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
– కేతేపల్లి, ఏప్రిల్ 4
కేతేపల్లి, ఏప్రిల్ 4 : ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఆయన పాలనలో ప్రజలు రెండు పూటలా భోజనం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన పార్టీ శ్రేణులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. సమైక్య పాలనలో మన ప్రాంతం ఆకలిచావులు, దరిద్రం, ఆత్మహత్యలకు నిలయంగా ఉండేదన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించిన ఘనుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు.
సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. గతంలో ఒక్క పూట కూడా తిండికి గతిలేని పేద కుటుంబాలు స్వరాష్ట్రంలో రెండు పూటలా భోజనం చేస్తున్నాయని పేర్కొన్నారు. సుభిక్ష పాలన, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ప్రతి ఇంటికీ మంచినీరు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని తెలిపారు. సగటున గ్రామానికి ప్రతి నెలా రూ.5లక్షలు మంజూరు చేస్తూ గ్రామాలను సస్యశ్యామలం చేశామన్నారు. పల్లె ప్రగతి, హరితహారంతో పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనమే తొణికిసలాడుతున్నదని పేర్కొన్నారు. గతంలో సాగునీరు లేక తిండికి సరిపడా పంటలు పండేవికావని, నేడు వరి సాగులో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. 47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో నల్లగొండ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలువడం గర్వకారణమన్నారు.
మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్ను దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారని, ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఇక్కడి పథకాలను దేశ ప్రజలకు అందించడం కోసమే బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. సీఎం కేసీఆర్కు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఆది నుంచీ అండగా ఉన్నట్లే మన జిల్లా ప్రజలు కూడా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని కోరారు.
దేశాన్ని కార్పొరేట్లకు దోచి పెడుతున్న మోదీ
సామాన్య ప్రజల నడ్డివిరుస్తూ ఇద్దరు కార్పొరేట్లకు లాభం చేకూరేలా మోదీ పాలన సాగుతున్నదని మంత్రి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు సామాన్యులకు అందుబాటులో ఉన్న డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు నేడు మూడు రెట్లు పెరిగాయన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం కూడా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవని తెలిపారు. 25 ఏండ్ల బీజేపీ పాలనలో గుజరాత్లో నేటికీ రూ.600కు మించి పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు సరైన సంక్షేమ పథకాలు అందివ్వడంలో విఫలమయ్యాయని విమర్శించారు. సొంత రాష్ట్ర ప్రజలకు కనీసం మంచినీళ్లు అందించలేని మోదీ.. మన రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడో ఆ పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో పేదల జేబులు నింపుతుంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ జేబులకు చిల్లులు పెడుతున్నారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారిందని, రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసినా మాట్లాడలేని దుస్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఊళ్లల్లోకి వస్తే 60 ఏండ్ల పాటు ఈ ప్రాంతానికి ఏం చేశారో నిలదీయాలని సూచించారు.
బీఆర్ఎస్ గెలుపునకు సైనికుల్లా పనిచేయాలి
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని, 60 ఏండ్లలో జరుగని పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సేవకుడిగా పని చేస్తున్నారని, అందుకే దేశ ప్రజలు ఆయన వైపు చూస్తున్నారని తెలిపారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పార్టీకి వెన్నుపోటు పొడిచే వారిని ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిళలకు వడ్డించి వారితోపాటు కింద కూర్చొని భోజనం చేశారు.
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. దళితులకు దళితబంధు, యాదవులకు గొర్రెల పంపిణీ, కులవృత్తుల వారికి చేయూతనిస్తూ అవసరమైన పథకాలను అందజేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా కంపచెట్లు, గుంతల రోడ్లు ఉండేవన్నారు. స్వరాష్ట్రంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లతోపాటు సుందరంగా మారాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలపై గ్రామాల్లో చర్చ జరుపాలని, గతానికి నేటికి ఉన్న తేడాను వివరిస్తూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.
మూడోసారి బీఆర్ఎస్దే అధికారం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని, మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారని, మిగిలిన 40శాతం ఓట్ల కోసం ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో పేరుకే కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులున్నారని, వారు జిల్లా అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. స్వరాష్ట్రంలో అభివృద్ధిలో నల్లగొండ జిల్లా దూసుకుపోతున్నదన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతో సాగు పండుగలా మారిందని చెప్పారు. పేదలకు అందజేస్తున్న సబ్సిడీలను ఎత్తివేయాలని చెప్తున్నప్రధాని మోదీ.. కార్పొరేట్ శక్తులకు రూ.12.50లక్షల కోట్లు ఎలా మాఫీ చేశారని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని, రాష్ట్రంలో మూడోసారీ గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కార్పొరేట్ల కొమ్ముకాస్తున్న బీజేపీ
సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సహించలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి పార్టీని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ యత్నించిందన్నారు. 9రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడ అధికారంలో ఉన్న పార్టీలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. రాష్ర్టానికి రావాల్సిన రూ.6వేల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతున్నదన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరించాలి
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తిరిగి వివరించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాల ఏర్పాటుకు పిలుపునిచ్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కేతేపల్లి గులాబీమయం
ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కేతేపల్లి గులాబీమయమైంది. పార్టీ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై భారీ ర్యాలీ నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీటీసీ బి.స్వర్ణలత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బడుగుల శ్రీనివాస్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, నాయకులు చిముట వెంకన్నయాదవ్, బంటు మహేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.