నిత్యావసర వస్తువుల్లో రోజురోజుకూ కల్తీ పెరిగిపోతున్నది. ప్రధానంగా వంట నూనెల్లో మరింత ఎక్కువగా జరుగుతున్నది. అవి వినియోగించిన జనం అనేక రోగాల బారిన పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఆ రైతు దంపతులు స్వచ్ఛమైన నూనె తయారు చేసి అందిస్తున్నారు. కట్టె గానుగతో సహజసిద్ధ నూనె తయారు చేసి అక్కడే అమ్మకాలు చేపడుతున్నారు.
నల్లగొండ మండలంలోని రాములబండ గ్రామానికి చెందిన బొబ్బలి జనార్దన్రెడ్డి ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి 15 ఏండ్లుగా హౌజ్ వైరింగ్, డెకరేషన్, లైటింగ్ నడుపుతూ జీవనం కొనసాగించాడు. కరోనా సమయంలో స్వగ్రామం వచ్చిన ఆయన.. తనకున్న 8 ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి పంటలు సాగు చేశాడు. ప్రకృతి సిద్ధమైన సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉన్న ఆయనకు మొదటగా కల్తీ లేని సహజసిద్ధమైన వంట నూనెలు అందించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో గ్రామంలో ఎద్దుతో నడిచే కట్టె గానుగలు ఏర్పాటు చేసి భార్య జ్యోతితో కలిసి స్వచ్ఛమైన వంట నూనెలు ఉత్పత్తి చేస్తున్నాడు. దానిపై వారు ఉపాధి పొందడంతో పాటు మరో ఇద్దరికి పని కల్పిస్తున్నారు. 20 రోజుల క్రితం కట్టె గానుగ నూనె తయారు చేయడం ప్రారంభించగా.. రోజుకు 15 లీటర్ల నూనె ఉత్పత్తి చేస్తున్నారు. కిలో పల్లీ నూనె 380 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు. కట్టె గానుగలతో పల్లీతోపాటు, కొబ్బరి, నువ్వులు, కుసుమ, ఆవాలు, గడ్డి నువ్వుల నూనెలు పట్టవచ్చు. కానీ.. ప్రస్తుతం పల్లీ నూనె మాత్రమే పడుతున్నారు. 12 కిలోల పల్లీలు పడితే రూ.450 తీసుకుంటున్నట్లు వారు చెప్పారు.
సహజసిద్ధంగా అందించేందుకే..
ప్రజలకు సహజసిద్ధమైన నూనెలు అందించేందుకే కట్టె ఏర్పాటు చేశాం. మొదటగా యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన చేశాం. మహబూబ్నగర్కు వెళ్లి ఎలా చేస్తున్నారో.. ఖర్చు, ఇతర వివరాలు తెలుసుకున్నాం. ఒక్కో గానుగకు లక్షా 50 వేలు ఉండగా.. మూడు లక్షల రూపాయలతో రెండింటిని ఏర్పాటు చేశాం. దీంతోపాటు నాలుగు ఎద్దులు కొనుగోలు చేశాం. 3కిలోల పల్లీలకు ఒక కేజీ నూనె వస్తుంది. రోజుకు సుమారుగా 15 కిలోల నూనె పడుతున్నాం. పల్లీతోపాటు పలు రకాల నూనెలు ఉత్పత్తి చేస్తాం. గానుగ నూనెతో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. మాలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుంది.
– బొబ్బలి జ్యోతి, ఎద్దుగానుగ నూనె ఉత్పత్తిదారు
గానుగ నూనె ఆరోగ్యానికి మేలు
ఎద్దు గానుగతో తీసిన నూనెలు సంపూర్ణ ఆర్యోగం అని కొనుగోలు చేశా. నూనె కిలో రూ.380 అయినప్పటికీ మార్కెట్లో దొరికే రిఫైండ్ ఆయిల్ కంటే ఎంతో ఉపయోగకరం. అందుకే 190 రూపాయలు పెట్టి అర కేజీ కొనుగోలు చేశా. పూర్వం ఇలాంటి సహజ సిద్ధమైన ఎద్దుగానుగ నూనెలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు తిరిగి అలాంటి నూనెలు రావడం సంతోషకరం.
– వెంకటయ్య, చీకటిమామిడి, మునుగోడు మండలం