నీలగిరి, మార్చి 3 : పోలియో రహిత దేశంగా మార్చే కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో విజయవంతమైంది. నల్లగొండ జిల్లాలో 1,61,925 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించగా 1,41,086 మందికి వేశారు. 87.13 శాతం పూర్తయ్యింది. మిగిలిన 12.87 శాతాన్ని సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి వైద్యారోగ్య సిబ్బంది వేయనున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్ఓ అన్నిమళ్ల కొండల్రావు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో 90 శాతం పల్స్ పోలియో జరిగిందని, మిగిలిన సోమ, మంగళవారాల్లో పూర్తి చేస్తామని డీఎంహెచ్ఓ కోటాచలం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు.