గతంలో దామరచర్ల మండలానికి ఒకవైపు కృష్ణా, మరోవైపు మూసీ, మధ్యలో అన్నవేరు వాగు ప్రవహిస్తున్నా నీరంతా దిగువకు వెళ్లిపోయేది. రైతులకు ఉపయోగం లేకుండా వృథా అయ్యేది. నేడు కృష్ణానదిపై రెండు జలాశయాలు, మూసీ నదిపై చెక్డ్యామ్లు నిర్మించడంతో నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి చుట్టూ జలాశయాలుగా మారిపోయాయి. మధ్యలో వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం వద్ద అన్నవేరు వాగు నిత్యం నీటితో ప్రవహిస్తూ ఇర్కిగూడెం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. గతంలో తీవ్ర కరువు కారణంగా సరైన వర్షాలు లేకపోవడంతో కృష్ణా, మూసీ నదులతోపాటు అన్నవేరు వాగు ఎండిపోయిన దుస్థితి నెలకొంది. కానీ, స్వరాష్ట్రంలో ఎన్నడూ ఆ పరిస్థితి రాలేదు. నిత్యం నీటితో కళకళలాడుతూ అన్నదాతలకు సాగునీటితోపాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాయి.
టెయిల్పాండ్ వద్ద 7 టీఎంసీల నీరు నిల్వ
నాగార్జునసాగర్ దిగువన 21 కిలోమీటర్ల పరిధిలోని అడవిదేవులపల్లి మండల కేంద్రం వద్ద కృష్ణానదిపై టెయిల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేసి సాగర్ విద్యుత్ ఉత్పత్తికి వాడిన నీటిని టెయిల్పాండ్ వద్ద నిల్వ చేసి ఫీక్ అవర్లో సాగర్ జలాశయానికి పంపుతారు. సమైక్య పాలనలో ఇక్కడ నీటిని నిల్వ చేయకపోగా ఆంధ్రాకు తలరించుకుపోయారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టు వద్ద జెన్కో అధికారులను ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేయడాన్ని ప్రారంభించారు. దాంతో టెయిల్పాండ్ నుంచి సాగర్ వరకు పెద్ద జలాశయంగా మారింది. ఏడు టీఎంసీల నీరు నిత్యం నిల్వ ఉంటుంది. దాంతో కృష్ణానది ఇరువైపులా సుమారు పది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. మఠంపల్లి మండలం వద్ద కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టుతో అక్కడి నుంచి టెయిల్పాండ్ వరకు సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో మరో జలాశయంగా మారింది. దాంతో మండలం పరిధిలోని సుమారు 20 గ్రామాలకు మంచి నీటి వసతి సమకూరింది.
మూసీ నుంచి వచ్చిన వరద వాడపల్లి వద్ద నిలుస్తుంది. దాంతో భూగర్భజలాలు పెరిగి బోర్లు ఫుల్గా పోస్తున్నాయి. వేలాది ఎకారాల భూమి అదనంగా సాగులోకి వచ్చింది.
మూసీ నదిపై చెక్డ్యామ్..
మూసీ నదిపై దామరచర్ల, శూర్నేపహాడ్ గ్రామాల మధ్య చెక్డ్యాం ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో జలాశయంగా మారి నదిలో నీరు నిలిచింది. పైన కురిసిన వర్షాలకు నీటి వరద ఉధృతంగా రావడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్డ్యామ్తో నీరు నిలిచి జలాశయంగా మారింది.
నిండుకుండల్లా చెరువులు..
దామరచర్లలోని నాగుల చెరువు, బైరవాన్ చెరువు, కొండ్రపోల్, బొత్తలపాలెం, తాళ్లవీరప్పగూడెం, దిలావర్పూర్ గ్రామాల్లోని పెద్ద చెరువులు, మిగతా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇటీవల కురిసిన వానలకు చెరువుల్లో ఆశించిన స్థాయిలో నీరు వచ్చి చేరింది. గతంలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దీనికితోడు చెరువులను ఏడాదికి రెండుసార్లు సాగర్ జలాలతో నింపడంతో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి.