నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతున్నారు. వానకాలం సాగు కొంత ఆలస్యంగా మొదలుపెట్టిన వాళ్లు కోతలు కోస్తుండగా, ఇప్పటికే పంట కోసిన వాళ్లు యాసంగి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దుక్కులకు నీళ్లు పెట్టి తుకం పోసుకుంటున్నారు. ఓవైపు కోతలు, కల్లాలు, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మకాలు ముమ్మరంగా సాగుతుండగా, మరోవైపు యాసంగికి నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. నాగార్జునసాగర్ జలాశయంలో పుష్కలంగా నీళ్లుండడంతో రైతులు వరివైపు మొగ్గు చూపుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.10 అడుగుల మేర నీరుంది. ఈ నెల 15లోగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
నాగార్జున సాగర్ జలాశయంలో నీరు సమృద్ధిగా ఉండడంతో సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న ఆయకట్టు రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వానకాలం పంట కోతలు పూర్తికాగా మరికొన్ని చోట్ల చివరి దశలో ఉన్నాయి. కోతలు పూర్తయిన రైతులు దుక్కి దున్నే పనిలో నిమగ్నమయ్యారు. ఎరువులు, విత్తనాలు తెచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
నూతనకల్/మోతె, డిసెంబర్ 6 : వ్యవసాయంలో రోజురోజుకు పెట్టుబడులు పెరిగి రైతుకు లాభాలు తగ్గుతున్నాయి. కూలీల కొరత కూడా వేధిస్తున్నది. దీన్ని అధిగమించడానికి డ్రమ్ సీడర్ విధానం అందుబాటులోకి వచ్చింది. సాగు ఖర్చులు తగ్గడంతోపాటు పంట దిగుబడి కూడా బాగానే వస్తున్నది. ఈ పద్ధతిలో సత్ఫలితాలు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. అన్ని మండలాల్లో ఈ విధానాన్ని అనుసరిం చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. నూతనకల్ మండలంలో సుమారు 200 ఎకరాల్లో డ్రమ్ సీడర్ విధానం ద్వారా సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి మురళి, మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి జానయ్య తెలిపారు. మోతె మండలంలో కూడా డ్రమ్సీడర్ విధానంపై ఏఈఓ కార్తీక్ విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
ఏం లాభాలంటే?
ఈ ఏడాది ఎడమ కాల్వకు ముందే నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయంలో పుష్కలంగా నీరు ఉండడం, పై నుంచి వరద రావడంతో ఈ ఏడాది వానకాలంలో ముందుగానే ఎడమ కాల్వకు నీటి విడుదలను ప్రారంభించారు. గత మూడు నెలలుగా సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో 586.10 అడుగుల వద్ద(300 టీఎంసీలు)నీరుంది. యాసంగిరిలో వరి సాగుకు సుమారు 50 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ఈ నెల 15 లోపు యాసంగికి నీటి విడుదల చేసే షెడ్యూల్ను ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నదని ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు.
10.33 లక్షల ఎకరాల ఆయకట్టు
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.99 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.77 లక్షల ఎకరాలు, 40 లిఫ్ట్ల ద్వారా మరో 82 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో 3.75 లక్షల ఎకరాలకు ఎడమ కాల్వ ద్వారా సాగునీరు అందజేస్తున్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా వానకాలంతోపాటు యాసంగికి సాగర్ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టు రైతులు పూర్తిస్థాయిలో సాగు చేస్తున్నారు.
హాలియా సబ్ డివిజన్లో లక్ష ఎకరాల సాగు
నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా వ్యవసాయ సబ్ డివిజన్లో ఈ యాసంగిలో సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉన్నది. గత వానకాలంలో ఈ వ్యవసాయ డివిజన్లో 1.20 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ఇందులో అనుముల, నిడమనూరు, త్రిపురారం మండలాల్లో ఎడమ కాల్వ ద్వారా 50 వేల ఎకరాల్లో.. ఎస్ఎల్బీసీ, చెరువులు, బోరుబావుల కింద 70 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ యాసంగిలో కాల్వ చివరి భూమి రైతులతోపాటు బోరుబావుల కింద రైతులు వరికి బదులు చిరు ధాన్యాలను సాగు చేసే అవకాశం ఉన్నది. వరి వేసే రైతుల్లో 60 శాతం మంది సన్నరకం ధాన్యం, మిగిలిన 40 శాతం మంది దొడ్డురకం ధాన్యం సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులు బిజీబజీ
సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న ఆయకట్టు రైతులు నెల రోజులుగా బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు వరికోతలు, మరోవైపు కల్లాలు, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు యాసంగి వరిసాగుకు రైతులు వరి నారుమడులను సిద్ధం చేసుకుంటుండంతో సందడిగా కనిపిస్తున్నది.
మేలైన విత్తనంతోనేమెరుగైన పంట
విత్తన శుద్ధి, మొలక శాతం పరీక్షించుకోవాలి
నేరేడుచర్ల, డిసెంబర్ 6 : యాసంగిలో సాగుచేసే రైతులు మేలైన విత్తనాలను ఎంచుకొని పరీక్షించుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి. నారు పోసే ముందు మొలక శాతం పరీక్షించుకోవాలి. రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
ఎకరానికి 25 కిలోల విత్తనాలు
సస్యరక్షణ అవసరం
యాసంగిలో జాగ్రత్తలు తప్పనిసరి ఇవి పాటించాలి..
నేరేడుచర్ల, డిసెంబర్ 6 : యాసంగిలో వరి సాగు చేసేందుకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. చలి తీవ్రత వల్ల నారు ఎదుగుదల తగ్గిపోతుంది. పలు జాగ్రత్తలు తీసుకుంటే నారు త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతుందని నేరేడుచర్ల వ్యవసాయ అధికారి వీరభద్రరావు సూచిస్తున్నారు.
సాగునీటికి ఇబ్బంది లేదు
చాలా ఏండ్లుగా నేను రెండు కార్లు వరి పండిస్తున్నా. ఈ ఏడాది యాసంగిలో కూడా వరి వేస్తున్నా. దేవుడి దయ వల్ల నాగార్జున సాగర్లో పుష్కలంగా నీరు ఉంది. వరి సాగుకు నీటి ఇబ్బంది లేదు. అందుకే రైతులంతా వరికే మొగ్గు చూపుతున్నారు.
-ఆర్, రామలింగయ్య, రైతు, పేరూరు, అనుముల
వరి సాగే మాకు ఆధారం
మాది సాగర్ ఎడమ కాల్వ కింది ప్రాంతం కావడంతో వరి ఎక్కువగా వేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, కరెంట్కు ఇబ్బంది లేదు. పండించిన పంటను ప్రభుత్వమే కోనుగోలు చేస్తున్నది. అందుకే ఈ సారి కూడా వరి వేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతుకు ఢోకాలేదు.
-చేగొండి కృష్ణ, రైతు, చల్మారెడ్డిగూడెం, అనుముల