ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజారోగ్యానికి గతంలోని బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా వైద్య సేవలను విస్తరించింది. గతానికి భిన్నంగా అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచితంగా పంపిణీ చేసింది. మారుమూల పల్లెలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించింది. కొత్తగా ఆస్పత్రులను నెలకొల్పింది.
అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం టీ హబ్ (టీ డయాగ్నస్టిక్స్)లను ఏర్పాటు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలోని కేంద్ర ఆస్పత్రి వెనుకాల ఉన్న స్థలంలో రూ.1.25 కోట్లతో విశాల భవనం నిర్మించింది. కొత్త బిల్డింగ్లో అధునాతన ల్యాబ్ను ఏర్పాటు చేశారు. జూన్లో 30న టీ హబ్ను అప్పటి మంత్రి హరీశ్రావు వర్చువల్గా ప్రారంభించారు.
టీ హబ్లో అన్ని రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. మొత్తంగా 134 పరీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయా పరీక్షల కోసం రోగులు రావడాన్ని బట్టి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన పరీక్షలు అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. డయాబెటిక్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, రెనల్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, మైక్రోబయాలజీ పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈసీజీ, అల్ట్రాసౌండ్, మమ్మోగ్రామ్, టూడీ ఈకో, ఎక్స్రే పరీక్షలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ల్యాబ్ సిబ్బందిని సైతం నియమించారు.
టీ హబ్ అందుబాటులోకి వచ్చిన తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించారు. జూలై నుంచి నవంబర్ వరకు ఏకంగా 57,198 పరీక్షలు చేపట్టారు. 18,923మంది రోగుల నుంచి 32,452 నమూనాలు సేకరించి రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు. అత్యధికంగా భువనగిరి ఏరియా ఆస్పత్రి నుంచి 6,869 పరీక్షలు, గుండాల నుంచి 3,665, బొల్లేపల్లి యూపీహెచ్సీ నుంచి 3,570, నారాయణపురం యూపీహెచ్సీ నుంచి 3,464 పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజూ సగటున సుమారు 300 పైగా నమూనాలు టీ హబ్కు చేరుతున్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో వెయ్యి నుంచి 1,200 వరకు శాంపిళ్లు వస్తుండగా, వెనువెంటనే పరీక్షలు చేపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక సెప్టెంబర్లో 15,281, అక్టోబర్లో 16,232, నవంబర్లో 12,423 పరీక్షలు చేపట్టారు.
టీ హబ్ సెంటర్లలో నమూనాలు ఇచ్చిన వారికే కాకుండా మండలాల్లోని పీహెచ్సీలు, సీహెచ్సీల్లో సేకరించిన నమూనాల పరీక్షలు కూడా చేపడుతున్నది. జిల్లా కేంద్రాస్పత్రితోపాటు జిల్లాలోని 21పీహెచ్సీలు, 3 సీహెచ్సీలకు టీ హబ్ను అనుసంధానం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే సిబ్బంది శాంపిళ్లు సేకరించి.. అక్కడి నుంచి రోజువారీగా టీ హబ్కు పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఐదారు పీహెసీలకు ఒక రూట్ను రూపొందించి.. వాహనాలను ఏర్పాటు చేశారు. పీహెచ్సీల్లో సేకరించిన నమూనాలను ఆయా బృందాలు టీ హబ్కు తీసుకొస్తాయి. ఇక్కడ సిబ్బంది రోగనిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలను వెంటనే ఆన్లైన్లో పంపిస్తారు.
భువనగిరి.. హైదరాబాద్కు దగ్గరగా ఉన్నప్పటికీ అన్ని రకాల పరీక్షలు అందుబాటులో లేవు. పెద్ద పరీక్షలకు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేట్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్నది. దాంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతున్నది. కేసీఆర్ నిర్ణయంతో పేదలకు రూ.వేలల్లో ఆదా అవుతున్నది.
టీ హబ్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలు, మండలాల నుంచి నమూనాలు సేకరంచి ఇక్కడే పరీక్షలు చేపడుతున్నాం. రిపోర్టులను వెంటనే ఆన్లైన్లో పంపిస్తున్నాం. ఐదు నెలల్లోనే 57,198 పరీక్షలు నిర్వహించాం. గ్రామీణ, తండాల ప్రజలు తమకు పరీక్షలు అవసరమైతే దగ్గరలోని సబ్ సెంటర్లు, పీహెచ్సీలో నమూనాలు ఇస్తే సరిపోతుంది. జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ అర్జున్రాజ్, టీ హబ్ ఇన్చార్జి