మేళ్లచెర్వు, జనవరి 24 : మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు జరుగనున్న మహాశివరాత్రి జాతరకు రూ.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. జాతర ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్ మోహన్రావుతో కలిసి మంగళవారం ఆలయ ఆవరణలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ను కోరిన వెంటనే మేళ్లచెర్వు జాతరకు రూ.50 లక్షలు, జాన్పహాడ్ ఉర్సుకు రూ.50 లక్షలు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జాతరలను విజయవంతం చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
మంచినీరు, వైద్యం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, పారిశుధ్యంపై దృష్టి సారించాలని తెలిపారు. గత నాలుగేండ్లుగా మేళ్లచెర్వు ఆలయంలో ప్రభుత్వ నిధులతోపాటు దాతల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, కోనేరు, ఎద్దుల పందేల నిర్వహణకు స్టేడియం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రూ.3.5 కోట్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మట్టితో చదును చేసే పనులను ఆయన పరిశీలించారు. స్థానిక పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, తాసీల్దార్ దామోదర్రావు, కోదాడ రూరల్ సీఐ నాగదుర్గాప్రసాద్, స్థానిక సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్రెడ్డి, ఈఓ గుజ్జుల కొండారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.