మేళ్లచెర్వు, ఫిబ్రవరి 5 : ఈ నెల 18న మహాశివరాత్రి వేడుకలకు స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం ముస్తాబవుతున్నది. ఇప్పటికే ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో పలు అభివృద్ధి పనులు పూర్తికాగా..జాతర కోసం ఆలయానికి ఇటీవల ప్రభుత్వం రూ.50 లక్షల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేసింది. వీటితో ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
మేళ్లచెర్వులో స్వయంభువుగా వెలసిన శివాలయానికి ప్రాచీన చరిత్ర ఉంది. తలపై గంగతో పాటు ప్రతి 12 ఏండ్లకు అంగుళం చొప్పున శివలింగం పెరగడం ఇక్కడ ప్రత్యేకత. మహా శివరాత్రికి ప్రతిఏటా ఇక్కడ ఐదు రోజుల పాటు జాతర కొనసాగుతుంది. పరిసర ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివస్తుంటారు. ప్రతి సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు, పుష్పాలతో విశేషాలంకరణలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయానికి ఎస్డీఎఫ్, మినరల్ ఫండ్ నిధులతో పాటు దాతల సహకారంతో రాజగోపురాలు, అన్నదాన సత్ర నిర్మాణ పనులతో పాటు ఆలయానికి రంగులు వేసే పనులు పూర్తయ్యాయి.
ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం
జాతర నిర్వహణకు ప్రభుత్వం ఇటీవల ఎస్డీఎఫ్ నిధులు రూ.50 లక్షల విడుదల చేసింది. వీటితో ప్రస్తుతం ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయం లోపల చలువ పందిళ్లు వేయనున్నారు. మరో వైపు ఆలయం వెనుక భాగంలో ఎడ్ల పందేలు, కబడ్డీ పోటీల నిర్వహణ కోసం మట్టితో చదును చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
మినరల్ ఫండ్తో పాటు దాతల సహకారంతో పలు అభివృద్ధి , రంగుల పనులు పూర్తయ్యాయి. ఇటీవల ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాజగోపురాలకు కలశప్రతిష్ఠ, కుంభాభిషేకం తదితర పూజలు శివరాత్రి జాతరలోగా నిర్వహించాల్సి ఉంది. దాతలు సహకరిస్తే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది.
– గుజ్జుల కొండారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి.