సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : సూర్యుడు రోజురోజుకూ మండిపోతున్నాడు. ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. మరీ రెండ్రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యుడు నిప్పులు కక్కుతుండగా మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా 40డిగ్రీలకు తక్కువ ఊష్ణోగ్రతలు నమోదు కాలేదు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా మఠంపల్లి మండలంలోని పెదవీడులో 44.7 డిగ్రీలు నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా మోత్కూరులో 43.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అలాగే నల్లగొండ జిల్లా కట్టంగూరులో 44.7, అనుముల మండలం ఇబ్రహీంపేటలో 44.6, నాంపల్లిలో 44.5, వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెంలో 44.5, మిర్యాలగూడలో 44.4 డిగ్రీలు నమోదు కాగా, ఈ జిల్లాలో శాలిగౌరారంలో అత్యల్పంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా పరిధిలో సూర్యాపేట మండలం టేకుమట్లలో 44.5 డిగ్రీలు నమోదు కాగా, మామిళ్లగూడెం, పెన్పహాడ్, తొగర్రాయిలో 44.5 డిగ్రీలు నమోదైంది. ఈ జిల్లాలో అత్యల్పంగా తుంగతుర్తిలో 40.3 డిగ్రీలు నమోదైంది. యాదాద్రి జిల్లా పరిధిలో గుండాలలో 43.1, వలిగొండలో 42.9, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురంలో 42.8, యాదగిరిగుట్ట, ఆలేరులో 42.7, ఆత్మకూరు(ఎం)లో 42.5, బొమ్మలరామారంలో 42.3, రాజాపేటలో 42.1, రామన్నపేటలో 42, భువనగిరి,
బీబీనగర్లో 41.7, అడ్డగూడూరులో 41.6, భూదాన్ పోచంపల్లిలో 41.1, మోటకొండూరులో 40.9, వలిగొండలో 40.5 డిగ్రీలు నమోదు కాగా, ఈ జిల్లాలో అత్యల్పంగా తుర్కపల్లి(ఎం)లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 45.2 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతలు నమోదు కావడంతో అర్ధరాత్రి అయినా వేడిమి తగ్గడంలేదు. మధ్యాహ్నం ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమితో జనం ఇండ్లకే పరిమితమవుతుండడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల మోత మోగుతుంది. ప్రజలు ఏ పని ఉన్నా ఉదయం, సాయంత్రం చేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడం లేదు.