ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సర్కారు దవాఖానలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నది. గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్పిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 416 పల్లె దవాఖానలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఒక్కో దవాఖానలో నిత్యం సగటున 30 నుంచి 40 మందికి వైద్యం అందిస్తున్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవల కోసం ప్రభుత్వం ఎంబీబీఎస్, బీఏఎంఎస్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా, జుంబా డ్యాన్స్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. సొంతూర్లోనే మంచి వైద్యం అందుతుండడం, ఆర్థిక భారం తప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలానికో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉండేది. దాంతో గ్రామాల్లో సకాలంలో వైద్యం అందేది కాదు. పట్టణాలు, మండల కేంద్రాలకు వెళ్లి చికిత్స చేయించుకునే పరిస్థితి ఉండేది. దీంతో పేదలు నానా తంటాలు పడేవారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో సైతం దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. హెల్త్ అండ్ వెల్నెస్ పథకం కింద పల్లె దవాఖానలను అభివృద్ధి చేసింది. యాదాద్రి వ్యాప్తంగా 143 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా.. 99 ఆరోగ్య కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చారు. జిల్లాలో నాలుగు బస్తీ దవాఖానలు కూడా ప్రారంభమయ్యాయి. భువనగిరిలో మూడు, చౌటుప్పల్లో ఒక ఆస్పత్రి నడుస్తున్నది.
పల్లె దవాఖానల్లో ఉచితంగా వైద్యం చేయడంతోపాటు రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. పల్లె దవాఖానల్లో 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ర్యాపిడ్ కిట్లతో అక్కడే పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాన్ని రాబడుతున్నారు. దీంతో రోగ నిర్ధారణ అవుతుండటంతో వెంటనే చికిత్స అందిస్తున్నారు. గర్భిణులు, పిల్లలకు పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన టీకాలు వేస్తారు. నవజాత శిశువులు, వృద్ధులకు ప్రత్యేక సేవలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా 100 రకాలకు పైగా మందులను అందుబాటులో ఉంచారు. పారాసిటమాల్, యాంటీ బయోటిక్, బీ కాంప్లెక్స్, విటమిన్ ట్యాబ్లెట్లతోపాటు బీపీ, షుగర్ ఔషధాలను కూడా ఇస్తున్నారు.
పేదలపై తగ్గిన ఆర్థిక భారం
పల్లె దవాఖానలు పేదలకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతున్నది. సాధారణంగా గ్రామాల్లో అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయిస్తారు. ప్రైవేట్లో రకరకాల పరీక్షలు, మందుల పేరుతో పెద్ద ఎత్తున బిల్లులు వేస్తుంటారు. దీంతో వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పల్లె దవాఖానల్లో ఉచితంగా సేవలు అందిస్తుండటంతో పేదలకు ఆర్థిక భారం తగ్గుతున్నది.
వారంలో ఒక రోజు యోగా, వ్యాయామం
పల్లె దవాఖానల్లో వారంలో ఒక రోజు ఏదో ఒక కార్యక్రమం చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కోసం యోగా, జుంబా డ్యాన్స్, వ్యాయామం తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా టెలీ కన్సల్టేషన్ అందుబాటులో ఉంచారు. ఏదైనా స్పెషాలిటీ వైద్యులతో మాట్లాడాలనుకుంటే ఆ సౌకర్యం కూడా ఉంది. ఇక ప్రతి మూడో శనివారం ఆరోగ్య సమితి కమిటీ సమావేశమవుతుంది. కమిటీ చైర్మన్గా సర్పంచ్ వ్యవహరిస్తారు. ఇందులో పల్లె దవాఖానకు ఏమేం కావాలి.. నెలలో ఏమేం కార్యక్రమాలు నిర్వహించారు? ఇంకా ఏం చేయాలి? తదితర అంశాలపై చర్చిస్తారు. ప్రతి నెలా 14న హెల్త్ మేళా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
9నుంచి 4గంటల వరకు..
గతంలో సబ్ సెంటర్లలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు మాత్రమే అందుబాటులో ఉండేవారు. సబ్ సెంటర్లు పల్లె దవాఖానలుగా మారిన తర్వాత సదుపాయాలు మెరుగయ్యాయి. ఎంబీబీఎస్, బీఏఎంఎస్, స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేశారు. యాదాద్రి జిల్లాలో 27మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, 39మంది బీఏఎంఎస్లు, 33 మంది స్టాఫ్ నర్సులను నియమించారు. సూర్యాపేట జిల్లాలో122, నల్లగొండ జిల్లాలో 195 పల్లె దవాఖానలు ఏర్పాటు కాగా.. ఒక్కో కేంద్రంలో ముగ్గురు చొప్పున నియమించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనే పల్లె దవాఖానల్లో ఉదయం 9నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. పల్లె దవాఖానలకు నిత్యం సగటున 30 నుంచి 40మంది పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు.
మరింత చేరువైన వైద్య సేవలు
ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం సంతోషకరం. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదవుతున్న తరుణంలో అందుబాటులో ఉచితంగా పలు రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి బస్తీ వాసులంతా రుణపడి ఉంటారు. గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతుండడంతో పెద్ద దవాఖానలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కారుకు కృతజ్ఞతలు.
– కరాటే బాలు, రేణికుంట, రాజాపేట మండలం
పల్లె దవాఖానతో పేదలకు ఎంతో మేలు
పల్లె దవాఖానలతో గ్రామీణ పేదలకు ఎంతో మేలు జరుగుతున్నది. చిన్నారులకు టీకాలు, గర్భిణులకు పరీక్షలతోపాటు అత్యవసర సేవలు అందుతున్నాయి. ప్రజలు వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన బాధ తప్పింది. ప్రజలకు నిరంతరం నాణ్యమైన వైద్యం అందుతున్నది.
– బండ జహంగీర్, పటేల్గూడెం (ఆలేరు రూరల్)