నీలగిరి, జూన్ 11 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వీటిని చేపట్టనున్నారు. అందుకోసం పోలీస్ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కార్యక్రమంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి హైదరాబాద్ రోడ్ మీదుగా క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. పోలీసులతో పాటు, బెటాలియన్, జైలు, అటవీ, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల అధికారులు ర్యాలీలో భాగస్వాములు. ర్యాలీ అనంతరం అధికారులు బెలూన్లు ఎగురవేసి ఐక్యతను చాటనున్నారు.
జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ..
నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గ కేంద్రాల్లో 2కే రన్ నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితోపాటు జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ప్రారంభిస్తారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో, దేవరకొండ, నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, డీఎస్పీలు పాల్గొననున్నారు. పోలీస్ శాఖతోపాటు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థ్ధలను భాగస్వాములను చేయనున్నారు.
ఐక్యతకు చిహ్నంగా ర్యాలీ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రజల ఐక్యతకు చిహ్నంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత జరిగిన అభివృద్ధి, వచ్చిన మార్పులను వివరిస్తూ నిర్వహించే 2కే రన్లో యువకులు, విద్యార్థులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.
సూర్యాపేటలో పాల్గొననున్న మంత్రి జగదీశ్రెడ్డి
చివ్వెంల : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుంచి సద్దుల చెరువు వరకు నిర్వహించనున్న 2కే రన్లో యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్ఐ విష్ణు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. 2కే రన్ అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.