నమస్తే తెలంగాణ నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇంచార్జి డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా అశ్వాపురంలో 10 సెంటీమీటర్లు, న్యాల్కల్, పరకాలలో 8 చొప్పున, కౌడిపల్లిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.
పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొర్రేడు వాగు, గోధుమవాగుల్లోకి వరదనీరు చేరింది. చుంచుపల్లి, జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం మండలాలతోపాటు పాల్వంచలోనూ వర్షం కురిసిం ది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని దేవరంపల్లి వాగు పొంగిపొర్లింది. వికారాబాద్తోపాటు మోమిన్పేట, ధారూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పిడుగుపాటుకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లికి చెందిన మహిళ మృతిచెందింది. గ్రేటర్ హైదరాబాద్లోని పలుచోట్ల జల్లులు పడ్డాయి.