కట్టంగూర్(నకిరేకల్), డిసెంబర్ 17 : అంకితభావంతో పని చేసిన నాయకులకు తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని, సరైన సమయంలో పదవులు వస్తాయని మరోసారి రుజువైంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే గాకుండా, టీఆర్ఎస్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న దూదిమెట్ల బాలరాజుయాదవ్కు గౌరవం దక్కింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ వామపక్ష ఉద్యమంలో దీర్ఘకాలం పని చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఓయూ జేఏసీ నుంచి అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. ఓయూ జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా, జేఏసీ అధికార ప్రతినిధిగా పని చేశారు. విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనదైన పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ పిలుపుఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అప్పగింంచిన ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. సమైక్య పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున 2013 సెప్టెంబర్ 7న నిర్వహించిన ఏపీఎన్జీఓల సభలోకి దూసుకెళ్లి తెలంగాణ గళం వినిపించారు. సమైక్య గూండాల దాడిలో తీవ్రంగా గాయపడినా తెలంగాణ అంటూ నినదించారు. విద్యార్థి ఉద్యమంలో 150కిపైగా కేసులు, రెండుసార్లు 50 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. 2010 జనవరి నుంచి ఫిబ్రవరి 7వరకు 21 రోజులు 721 కిలోమీటర్లు సాగిన మహాపాదయాత్రలో పాల్గొన్నారు. 2011 డిసెంబర్ 11 నుంచి 2012 జనవరి 10వరకు ఓయూ నుంచి నిజామాబాద్ భీమ్గల్ వరకు 1,500 కిలోమీటర్ల మేర సైకిల్యాత్ర చేపట్టారు. గ్రూప్-1ఉద్యోగాలపై 2010లో, ఎస్ఐ ఉద్యోగాల ఫ్రీ జోన్ అంశంపై 2010 నవంబర్ 11న ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిరాహార దీక్ష చేశారు. 2011 జనవరి నుంచి ఫిబ్రవరి 9 వరకు సహాయ నిరాకణ ఉద్యమానికి మద్దతుగా నాటి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ రూపొందించిన విద్యార్థి బస్సు యాత్ర బృందానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు.