తుంపర సేద్యంలో పత్తి, వేరుశనగ
చందంపేట మండలంలో ఫలిస్తున్న ప్రయోగం
నీటి వినియోగం తక్కువ..
వానల కోసం ఎదురు చూడాల్సిన పనీ లేదు
రైతు బంధు డబ్బులతోనే స్ప్రింక్లర్ల కొనుగోలు
చందంపేట, జూలై 15:స్ప్రింక్లర్లతో పత్తి సాగు. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదూ! అదీ.. ఒకప్పుడు కరువు, వలసలకు కేరాఫ్గా ఉన్న చందంపేట మండలంలో!! భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్, సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి గిరిజనం సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నది. వర్షాధార పంటలైన పత్తి, వేరుశనగను తుంపర సేద్యం చేస్తూ మట్టి నుంచి బంగారం పండిస్తున్నది. ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు మొహం చాటేస్తుందో తెలియని వానలతో పని లేకుండా దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నది. సమయానికి నీటి తడులు అందుతుండడంతో మంచి దిగుబడి సాధిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు డబ్బులతోనే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు.
కరువు నేలగా పేరొందిన చందంపేట మండలంలో నేడు సిరులు పండుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తోడు రైతులు మూస ధోరణికి స్వస్తి పలికి చేస్తున్న సేద్యం వారికి లాభాలను తెచ్చిపెడుతున్నది. ప్రభుత్వం అందించిన రైతు బంధు పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులు మూడేండ్లుగా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
చందంపేట మండలంలోని రైతులు వర్షాలపై ఆధారపడకుండా తుంపర సేద్యానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడంతో బోర్లు వేసుకుని సబ్సిడీపై స్ప్రింక్లర్లు, పైపులు కొనుగోలు చేశారు. ఏటా పత్తి, వేరుశనగ సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు.
ఒక్కడితో మొదలై..
చందంపేట మండలం బుడ్డోని తండాకు చెందిన నేనావత్ రాములు ఐదెకరాల్లో మూడేండ్లుగా పత్తి, వేరుశనగ సాగు చేస్తున్నాడు. పొలంలో బోరు వేయడంతో పుష్కలంగా నీళ్లుపడ్డాయి. తుంపర పద్ధతిలో పంటకు నీరందించడంతో మంచి దిగుబడి సాధిస్తున్నాడు. దీంతో రాములును స్ఫూర్తిగా తీసుకున్న మరో 60మందికి పైగా రైతులు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకున్నారు. 15రోజుల కిందట విత్తనాలు వేసిన రైతులు రెండు రోజుల కిందటి వరకూ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించారు. తాజాగా వర్షాలు కురుస్తుండడంతో వాటిని నిలిపేశారు. ఈ పద్ధతి ద్వారా మొక్కలు ఎండిపోకుండా మంచి దిగుబడి కూడా వస్తుందని, ఎకరానికి 15క్వింటాళ్ల పత్తి, 12క్వింటాళ్ల వేరు శనగ దిగుబడి రావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్నట్లు రైతులు తెలిపారు.
మూడేండ్లుగా స్ప్రింక్లర్లతోనే సాగు…
రాష్ట్ర ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏటా రెండు పంటలు సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ప్రైవేటు అప్పులు లేకుండా దర్జాగా జీవనం గడుపుతున్నామని రైతు రాములు తెలిపాడు. స్ప్రింక్లర్లను సైతం ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుండటంతో తమకు వరంలా మారిందని చెప్పాడు.
స్ప్రింక్లర్లతో సాగుపై రైతుల్లో ఆసక్తి..
చందంపేట, నేరెడుగొమ్ము మండలాల రైతులు స్ప్రింక్లర్లతో సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నా రు. ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలు అందిస్తుండడంతో పైపులు, సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. గతంలో వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులంతా నేడు తుంపర సేద్యంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.