చందంపేట(దేవరకొండ), జూన్ 27 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు పతనావస్థలో ఉన్నాయి. సరైన వసతులు లేకపోవడం.. తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టణాలకు పంపేందుకు మొగ్గు చూపుతుండటంతో మారుమూల ప్రాంతాల్లోని సర్కార్ బడులను మూసివేస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట, దేవరకొండ, నేరేడుగొమ్ము, గుండ్లపల్లి, చింతపల్లి, కొండమల్లేపల్లి, పీఏపల్లి, గుడిపల్లి మండలాల్లో 150 పాఠశాలలు మూతపడగా ఒక్క చందంపేట మండలంలోనే 38 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..
గ్రామీణ ప్రాంతాల్లో అగమ్యగోచరం
నల్లగొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు.. పల్లెల్లో మారుతున్న జీవన పరిస్థితులు.. కుటుంబాలు జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో పాటు తమ పిల్లలను గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుండటం కూడా ప్రభుత్వ బడులు మూతపడేందుకు ఒక కారణం. గతంలో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా రావడం లేదనే విమర్శలు ఉండేవి. ఇటీవల ఐరిస్ అటెండెంట్స్ తీసుకొచ్చినప్పటికీ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గుతుండటం ఆందోళనకరం.
నామమాత్రంగా బడిబాట
ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు చేపట్టిన బడిబాట కార్యక్రమం చెప్పుకోదగ్గ ఫలితాలు ఇవ్వడంలేదు. ఉపాధ్యాయులు సైతం ఏదో పాల్గొనాలి కదా..అనే ఉద్దేశంతో పాల్గొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు ఒకటీ రెండు చోట్ల చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించాయి. చందంపేట మండలంలోని పెద్దమూల, నల్లచెల్లమూల ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి అంతే తప్ప చెప్పుకోదగిన స్థాయిలో అడ్మిషన్లు పెరగడంలేదనే చెప్పాలి.
చందంపేట మండలంలో ఇలా..
చందంపేట మండలంలో గతంలో 45కి పైగా పాఠశాలలు ఉంటే ఇప్పుడు కేవలం 14 ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. మండలంలో రాను రాను ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. మండలంలోని ముడుదండ్ల, పోల్యానాయక్ తండా, కొర్రతండా, రేకుల గడ్డ, బుడ్డోనితండా, కాకనూరి తండా, బొల్లారం పట్టి, అచ్చంపేట పట్టి, ఉస్మాన్కుంట, యల్మలమంద, రేకుల వలయం ఇలా కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.
పునఃప్రారంభించేందుకు కృషి
చందంపేట మండలంలో ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ బడులు మూతపడిన విషయం వాస్తవమే. అడ్మిషన్లు లేకపోవడంతో ప్రభుత్వం ఆయా పాఠశాలలను మూసివేసింది. ఇప్పుడు మండలంలో ప్రాథమిక, ఉన్నత, ఆశ్రమ, కేజీబీవీ, గురుకుల పాఠశాలలతో కలుపుకొని సుమారు 580 మంది విద్యనభ్యసిస్తున్నారు. మండలంలో మూతపడిన పాఠశాలలను తిరిగి తెరిపించేందుకు కృషి చేసి, రెండు పాఠశాలలు తెరిపించగలిగాం. గ్రామస్తుల సహకారంతో పాఠశాలలు పునఃప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం.
– రామలింగం, ఎంఈవో, చందంపేట
క్లోజ్ దిశగా మరికొన్ని..
అడ్మిషన్లు లేకపోవడంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ దారుణంగా తయారైంది. అడ్మిషన్లు లేకపోవడంతో ఆయా మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాల్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులకు ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం. దేవరకొండ మండలంలోని మైనంపల్లి గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి గ్రామస్తులకు ప్రేరణగా నిలిచారు. దీంతో ఆ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగాయి. ఇదే విధంగా సర్పంచులు, ఉపాధ్యాయులతో కలిసి బాధ్యత తీసుకొని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బతికించేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.