ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందడంలేదు. జిల్లాలో సగం ఇండ్లకే ఉచిత కరెంట్ మంజూరైంది. వీరంతా డబ్బులు చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ బిల్లులు జారీ చేస్తున్నది. సూర్యాపేట జిల్లాలో గృహ జ్యోతి పథకం కోసం ప్రజా పాలనలో 1,47,325 దరఖాస్తులు రాగా, ప్రభుత్వం మాత్రం 68,300 కనెక్షన్లకే మంజూరు ఇచ్చింది. వివిధ కారణాలతో ఫ్రీ కరెంట్ వర్తించ లేదు. ఇదిలా ఉండగా అర్హుల సమస్య పరిష్కారానికి సర్కారు ప్రజా పాలన కేంద్రాలను తీసుకొచ్చింది.
సూర్యాపేట/యాదాద్రి భువనగిరి, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చాక ఆయా పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. ఇందుకోసం డిసెంబర్ 28వ తేదీన ప్రజా పాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను తీసుకుంది. అదే నెల 17 వరకు వాటిని ఆన్లైన్ చేశారు.
68,300 కనెక్షన్లకే ఫ్రీ కరెంట్..
ఆరు గ్యారెంటీల్లో గృహ జ్యోతి పథకం ఒకటి. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ను వాడుకోవచ్చు. 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ అదనంగా వాడినా మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ఫ్రీ కరెంట్ కోసం 1,47,325 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని సిబ్బంది ఆన్లైన్లో అప్లోడ్ చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం 68,300 కనెక్షన్లకే మంజూరు ఇచ్చింది. అంటే 79,025 మందిని అనర్హులుగా తేల్చింది.
యాదాద్రి జిల్లాలో 1,18,350 కనెక్షన్లకు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్రీ కరెంట్ కోసం 2,09,131మంది దరఖాస్తులు చేసుకున్నారు. కానీ 1,18,350 కనెక్షన్లకే మంజూరు చేశారు. అంటే 90,781మందిని అనర్హులుగా తేల్చారు.. జిల్లాలో ఇప్పటి వరకు 40వేల వరకు విద్యుత్ బిల్లులు జనరేట్ చేశారు. ఇందులో 93శాతం జీరో బిల్లులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా జిల్లాలో 2.16లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండటం గమనార్హం.
వివిధ కారణాలు..
ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో మంజూరు చేయలేదని తెలిసింది. కొందరికి తెల్ల రేషన్ కార్డులు లేపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇక ఆధార్ కార్డు నంబర్లు సరిగా ఎంటర్ చేయకపోవడం, కస్టమర్ ఐడీ సరిగా ఇవ్వకపోడం లాంటి తదితర కారణాలతో మంజూరు కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కొంత మందికి 200యూనిట్లు కంటే ఎక్కువ కరెంట్ వాడి ఉండవచ్చని పేర్కొంటున్నారు.
ప్రజాపాలన కేంద్రాల ఏర్పాటు..
గృహ జ్యోతి పథకం అమలు మొదటి నెల కావడంతో కొన్ని చోట్ల లోపాలు ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. పెద్ద మొత్తంలో అనర్హులుగా తేలడంతో సమస్యల పరిష్కారానికి చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం జిల్లాలో ప్రజా పాలన కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి చేసింది. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో రెండేసి చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేయగా, మండలానికో సేవా కేంద్రం పెట్టారు. జీరో బిల్లుల రాని వా రు సేవా కేంద్రాల్లో సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఏమైనా పొరపాటు ఉంటే వెం టనే ఆపరేటర్ ఎడిట్ ఆప్షన్లో క్లియర్ చేయనున్నారు.
జీరో బిల్లు కోసం ప్రజల ఇక్కట్లు
శాలిగౌరారం, మార్చి 4 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పింది. ఆ మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ మేరకు ఈ నెల నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న ఇంటికి జీరో కరెంట్ బిల్లును అందజేస్తున్నది. ఈ నెల 2 నుంచి 200 యూనిట్ల లోపు వాడిన వారికి జీరో బిల్లులు వస్తుండగా చాలా మంది అర్హులకు రాకపోవడంతో అవాక్కయ్యారు. ఈ విషయమై విద్యుత్ సిబ్బందిని అడగగా తెల్లరేషన్ కార్డు ఉండి జీరో బిల్లు రానివారందరూ ఎంపీడీఓ కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో వారు అక్కడికి బారులుదీరుతున్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో జనం రావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు.