భక్తుల కోరిక మేరకు భద్రాద్రి రాముడి కల్యాణ తలంబ్రాలను ఇంటికే వచ్చి అందిస్తున్నది ఆర్టీసీ కార్గో. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు బుకింగ్ చేసుకున్న 10,379 మందికి తలంబ్రాలు అందించింది. 116 రూపాయలు చొప్పున ఆర్టీసీకి రూ.12,03,964 ఆదాయం సమకూరింది. తలంబ్రాల కోసం ఈ నెల 10 వరకు బుకింగ్ చేసుకునే వీలుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
– సూర్యాపేట, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే టీఎస్ ఆర్టీసీ ప్రజలకు ఇతర సేవలను కూడా అందించడంలో సఫలీకృతం అవుతున్నది. పాత బస్సులను కార్గో వ్యాన్గా మార్చి సరుకుల రవాణాకు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ కొరియర్ల కన్నా ఆర్టీసీ కార్గో తక్కువ చార్జి వేస్తుండడంతో ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ఆర్టీసీ పోస్టల్, లగేజీ క్యారియర్ సేవలను ప్రారంభించింది. దీంతో ఇతర కొరియర్ల మాదిరిగా కాకుండా గంటల వ్యవధిలోనే సరుకుల రవాణా జనానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామాల నుంచి రైతులు పండించిన పంటలను కూడా మార్కెట్లకు తరలిస్తున్నది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, జాతర్లకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నది. తాజాగా భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవ తలంబ్రాలను ముందస్తుగా రూ.116 చెల్లించి బుక్ చేసుకున్న భక్తులకు కార్గో ద్వారా అందిస్తున్నారు. దీంతో మూడ్రోజల వ్యవధిలోనే తలంబ్రాలు భక్తులకు అందుతుండగా ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుంది.
విశేష స్పందన..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల పరిధిలో మంగళవారం నాటికి 10,379 మంది భద్రాద్రి రాముడి కల్యాణ తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి రూ.12,03,964 ఆదాయం వచ్చింది. నల్లగొండ డిపో పరిధిలో 2,130 మంది బుక్ చేసుకోగా ఆ డిపోకు రూ.2,47,080 ఆదాయం లభించింది. దేవరకొండ డిపో పరిధిలో 1,643 మంది బుక్ చేసుకోగా రూ.1,90,588 ఆదాయం, మిర్యాలగూడ డిపో పరిధిలో 2,225 మంది భక్తులు బుక్ చేసుకోగా రూ.2,58,100, నార్కట్పల్లి డిపో ద్వారా 783 మంది సేవలు పొందగా.. ఆర్టీసీకి రూ.90,828 ఆదాయం వచ్చింది. సూర్యాపేట డిపో పరిధిలో 1,491 మంది బుక్ చేసుకోగా రూ.1,72,956 ఆదాయం, కోదాడ డిపోలో 1,221 మంది భక్తులు బుకింగ్ ఆర్డర్ ఇవ్వగా.. 1,41,636 రూపాయల ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. యాదగిరిగుట్ట డిపోలో 726 బుకింగ్ కాగా.. రూ.84,216 ఆదాయం లభించింది.
ఈ నెల 10 వరకు అవకాశం
ఈసారి శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా బుక్ చేసుకునే భక్తుల సంఖ్య పెరిగింది. బుక్ చేసుకున్న భక్తులకు మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో తలంబ్రాలను ఇంటికి చేర్చుతున్నాం. కల్యాణ తలంబ్రాలను బుకింగ్ చేసుకునే అవకాశం ఈ నెల 10 వరకు ఉంది. భక్తులు సద్వినియెగం చేసుకోవాలి.
– మహ్మద్ జానీపాషా, కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సూర్యాపేట