నేరేడుచర్ల, నవంబర్ 25 : ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు జనాభ ప్రాతిపధికన పది శాతం 15వ ఆర్థిక సంఘం నిధులు నిధులు విడుదల చేసింది. మండల పరిషత్, పంచాయతీల ప్రత్యేక ఖాతాల్లో జమయ్యాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను ప్రతీ మూడు నెలలకోసారి విడుదల చేయాలి, కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సారి విడుదల కాలేదు. దీంతో ఎనిమిది నెలలుగా సర్పంచులు, అధికారులు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ట్రాక్టర్ కిస్తీలు, పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్ధితులు నెలకొన్నాయి. ప్రస్తుతం కేంద్రం 10 శాతం నిధులను మాత్రమే విడుదల చేసింది.
సూర్యాపేట జిల్లాలోని మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు రూ.1,82, 56,854 లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మండల పరిషత్లకు రూ.1,05,47,003, పంచాయతీలకు రూ.77,09,851 లను ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం 2021- 22 ఆర్థిక సంవత్సరం మార్చిలో మంజూరు కావాల్సిన నిధుల్లో పది శాతమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన నిధులు మంజూరు కావాలంటే పీఎఫ్ఎంఎస్లో ఓచర్ జనరేట్ చేయాల్సి ఉంది. ఏజెన్సీలు, రెసిడెన్సీలు, పంచాయతీ ఉద్యోగులుగా విభజించి ఆన్లైన్ చేసిన అనంతరం చెక్కులను వారి పేరిట జారీ చేస్తారు. గతంలోనే నిధులు విడుదల కోసం సర్పంచ్, ఉప సర్పంచులకు డిజిటల్ కీలను పంచాయతీ అధికారులు అందజేశారు.
15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. ప్రసుత్తం మార్చి విడుతకు సంబంధించి కేవలం 10శాతం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన నిధుల మంజూరు కోసం ఓచర్ జనరేట్ చేసుకోవాలి.
– శంకరయ్య, ఎంపీడీఓ, నేరేడుచర్ల