నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 6 అసెంబ్లీ
నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటల తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిల్చుని
రాత్రి వరకు ఓపికగా ఉండి ఓటేశారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం 1.33 తగ్గింది. గతంలో 86.82 శాతం ఓట్లు నమోదు కాగా ఈసారి 85.49కు తగ్గింది.
యువతతోపాటు పట్టణాల్లో నివసిస్తున్న వాళ్లు సైతం సొంతూర్లకు తరలివెళ్లి పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 91.51 శాతం పోలింగ్ నమోదైంది. నల్లగొండ నియోజకవర్గంలో అత్యల్పంగా 81.5 పోలింగ్ శాతం నమోదైంది. ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన మొత్తం 144 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కాగా వాటిని అన్ని నియోజకవర్గాల భారీ భద్రత నడుమ నల్లగొండలో అనిశెట్టి దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. ఈ నెల 3వ తేదీన అక్కడే ఓట్ల లెక్కింపు జరుగనున్నది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్30(నమస్తేతెలంగాణ) : గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగిన నల్లగొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో ఉదయం నుంచే పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. సమయం గడుస్తున్నా కొద్దీ ఓటర్ల సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది. ఒకటి, రెండు చోట్ల ఈవీఎంలు కాసేపు మొరాయించడం మినహా జిల్లాలో ఎలాం టి చెదురు మదురు ఘటనలు కూడా జరగలేదు. పలుచోట్ల మహిళలు, దివ్యాంగులు, యువతతో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. జిల్లాలోని మొత్తం 14,64,080 మంది ఓటర్లు ఉండగా.. వారి కోసం 1766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 6 నియోజకవర్గాల పరిధిలో 144 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ఉత్సాహాంగా ప్రారంభమైంది. పోలింగ్ సమయం కంటే ముందే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం 8.66 శాతం పోలింగ్ నమోదు కాగా… తొలి రెండు గంటల్లో నాగార్జునసాగర్లో అత్యధికంగా 11.10 శాతం ఓట్లు పోలయ్యాయి. 11 గంటల వరకు జిల్లా అంతటా 22.74 శాతం పోలింగ్ నమోదయింది. ఇక్కడి నుంచి ఓట్ల నమోదు మరింతగా పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా అంతటా 39.20 శాతం ఓట్లు పోలయ్యాయి.
మధ్యాహ్నం 3 గంటల వరకు 59.98 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఇక్కడి నుంచి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం మొదలైంది. సాయంత్రం 5గంటల వరకు 75.24శాతం నమోదు కాగా… చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి కనిపించారు. పోలింగ్ తుది గడువు సాయంత్రం 5 గంటల వరకు కేంద్రాల్లోకి వెళ్లిన వారందరికీ ఓటువేసే అవకాశం ఉండడంతో ఈ సంఖ్య ఉంది. దీంతో కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం ఐదు గంటల వరకు నకిరేకల్ నియోజకవర్గంలో అత్యధికంగా 82.34 శాతం పోలింగ్ నమోదైంది.
గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగ్గా… పలు నియోజకవర్గాల్లోని పెద్ద గ్రామాల్లో రాత్రి వరకు ఓటర్లు లైన్ కట్టారు. కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు ఓపికగా క్యూలైన్లలో నిల్చుని తమ చైతన్యాన్ని చాటారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్లో ఉన్న ఓటర్లు అందరినీ ఎంత సమయమైన ఓటు వేయించాల్సి ఉన్నందున రాత్రి వరకూ అధికారులు పోలింగ్ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భారీ పోలీసు భద్రత నడుమ ముందుగా నియోజకవర్గ కేంద్రాల్లోని రిసెప్షన్ కేంద్రాలకు సిబ్బందితో సహా తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంల్లోని స్ట్రాంగ్రూమ్స్లకి తరలించారు. భారీ బందోబస్తుతో నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో దీనికి రక్షణ కల్పించనున్నారు.
ఇక ఈ నెల 3న ఆదివారం దుప్పలపల్లి గోదాంలలోనే ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తర్వాత ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను 14 టేబుళ్లపై లెక్కించనున్నారు. ఉదయం 10 గంటల వరకు ఫలితాల సరళి వెల్లడి కానుండగా మధ్యాహ్నం ఒంటి గంట వరకే మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుందని అంచనా.