మోత్కూరు, నవంబర్ 3 : లారీ టైర్లు ఊడి కింద పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని అనాజిపురం గ్రామంలో బుధవారం జరిగింది. అడ్డగూడూరు మండలంలోని బిక్కేరు వాగు నుంచి ఇసుకను లోడు కోసం లారీ మండలంలోని అనాజీపురం గ్రామం మీదుగా వెళ్తున్నది. ఈ క్రమంలో లారీ వెనుక టైర్లు రెండు ఊడి కింద పడి పోవడంతోఅక్కడే బస్సు కోసం ఎదురు చూస్తున్న అనాజీపురం గ్రామానికి చెందిన నల్ల పరమేశ్(33), వలిగొండ మండలం దుపెల్లికి చెందిన కన్నెబోయిన పావని, షణ్ముఖప్రియకు టైర్లు తగిలి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో పరమేశ్ తలకు బలమైన గాయం కావడంతో 108 వాహనం ద్వారా నార్కట్పల్లి కామినేనికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పావని, షణ్ముఖ ప్రియను మోత్కూరులోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కాగా పరమేశ్కు వైద్యం కోసం సాయం చేసి ఆదుకోవాలని అనాజిపురంలోని చౌరస్తాలో వలిగొండ-తొర్రూరు రోడ్డుపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకొని రాస్తారోకో విరమింప జేసే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. చివరికి లారీ యజమాని తక్షణ సాయంగా రూ.30 వేలు ఇస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల లక్ష్మమ్మ, మాజీ సర్పంచు బర్రె కములమ్మ, మాజీ ఉప సర్పంచులు కొల్లు శంకరయ్య, దేవరశ్రీశైలం,ఉప్పల యాదయ్య, చుక్క వెంకన్న పాల్గొన్నారు.