స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యదర్శులకు నేరుగా అకౌంట్లలో జమ
వచ్చే నెల నుంచి అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే ఖాతాల వివరాలు సేకరించి సమర్పించిన యంత్రాంగం
టీఆర్ఎస్ పాలనలో రెండు సార్లు వేతనాల పెంపు
నల్లగొండ, ఫిబ్రవరి 23 :స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గౌరవ వేతనం ఇకపై నేరుగా వారి ఖాతాల్లోనే జమ కానున్నది. వచ్చే నెల నుంచి దీన్ని అమలు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు సర్పంచ్లకు మండల పరిషత్ నుంచి ఎంపీడీఓల ద్వారా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు జిల్లా పరిషత్ నుంచి జడ్పీ సీఈఓల ద్వారా వేతనం అందుతున్నది. మూడో వ్యక్తితో సంబంధం లేకుండా నేరుగా తమ ఖాతాల్లోనే జమ చేసేందుకు సర్కారు తీసుకున్న నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ప్రతి నెలా విడుదలయ్యే పల్లె ప్రగతి నిధులను సైతం ప్రారంభంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చిన సర్కారు ఆ తర్వాత నేరుగానే పంచాయతీ ఖాతాల్లోనే జమ చేస్తున్నది. కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రెండుసార్లు వేతనాలు పెంచడం తెలిసిందే.
స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వచ్చే నెల నుంచి వారి వేతనం నేరుగా వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సర్పంచుల గౌరవ వేతనం, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం ఎంపీడీఓల ద్వారా గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేస్తున్నారు. దాంతో వారు చెక్ ద్వారా వేతనాన్ని తీసుకుంటున్నారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీల గౌరవ వేతనం జిల్లా పరిషత్ ద్వారా సీఈఓ అందజేస్తున్నారు. ఇక ఈ పద్ధ్దతికి ఫుల్స్టాప్ పెట్టి వ్యక్తిగత ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఈ మేరకు వారి ఖాతాల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించింది
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మండలాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మండలాలు ఉండగా 1,596 మంది సర్పంచులు, 1,120 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 71 మంది జడ్పీటీసీలు, 760 మంది ఎంపీటీసీలకు వచ్చే నెల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లో వేతనం జమ కానుంది. జనవరి నెలకు సంబంధించిన నిధులు ఎంపీడీఓ, జడ్పీ సీఈఓలకు ఇవ్వడంతో ఆ నెల వేతనం ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు అందజేశారు. ఫిబ్రవరి నెల వేతనం నిధులు ఇప్పటికే ఎంపీడీఓలు, సీఈఓ ఖాతాలకు రావాల్సి ఉండగా ఈ గ్రాంట్ నిలిపివేశారు. దాంతో స్థ్దానిక యంత్రాంగం ప్రజాప్రతినిధులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఖాతాలను సేకరించి ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలోవచ్చే నెల నుంచి కమిషనరేట్ నుంచి వేతనం నేరుగా ఖాతాల్లో జమ కానుంది.
సర్పంచులు, కార్యదర్శుల ఖాతాలు అందజేశాం
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల వేతనాలు ఇప్పటి వరకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారానే అందజేశాం. వచ్చే నెల నుంచి నేరుగా వారి ఖాతాల్లో జమ కానుంది. అందరి ఖాతా నంబర్లు తీసుకొని ప్రభుత్వానికి నివేదించాం.
–విష్ణువర్ధన్ రెడ్డి, డీపీఓ నల్లగొండ