నేరేడుచర్ల, జూలై 18 : వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే బోర్లు, బావుల కింద వరి నారు పోసుకున్న రైతులు నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలో నాట్లు వేసేటప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
పొలం తయారీ విధానం..
వరి నాట్లు వేసేందుకు సుమారు 3వారాల ముందు నుంచే పొలాన్ని తయారు చేసుకోవాలి. ట్రాక్టర్ లేదా ఎడ్ల నాగలితో ఒకసాలు దున్నిన తర్వాత నాలుగైదు రోజులకు మరో సాలు దున్నాలి. దీని వల్ల కలుపు మొక్కలు భూమిలో కలిసిపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడుతాయి. హడావుడిగా పొలాన్ని సిద్ధం చేస్తే కలుపు మొక్కలు ఎక్కువై దిగుబడిని దెబ్బతీస్తాయి. ఇటీవల కాలంలో చాలా మంది రైతులు జనుము, జీలుగ, పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను వేసుకొని 30 రోజుల తర్వాత భూమిలో కలియదున్నుతున్నారు. దీని వల్ల పంటకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. పచ్చిరొట్ట పైరు భూమిలో కలిసేందుకు సుమారు రెండు వారాల సమయం పడుతున్నది. కాబట్టి ఆ పైరును భూమిలో కలియదున్నేటప్పుడు ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ వేసుకుంటే త్వరగా భూమిలో కలిసిపోతుంది.
నాటు వేయడం ఇలా..
నాటు వేయడానికి 4-6 ఆకులు కలిగిన మొక్కలు ఆనుకూలంగా ఉంటాయి. బురద పదును ఉండేలా పొలాన్ని తయారు చేసుకుని 2-3 సెంటీమీటర్ల లోతులో నాటితే మంచిది. ఎక్కువ లోతుగా నాటితే పిలకలు రావడం ఆలస్యమవుతుంది. అంతేకాకుండా పిలకల సంఖ్య తగ్గిపోతుంది. కుదురుకు 2-3 మొక్కలు కూడా నాటవచ్చు. నాటేటప్పుడు నారు తలను తుంచితే మంచిది. సరైన సమయంలో మొక్కలు నాటితే కొనలను కత్తిరించాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా వానకాలంలో చదరపు మీటర్కు దీర్ఘకాలిక రకాలైతే 33 కుదుళ్లు, మధ్యకాలిక రకాలైతే 44 కుదుళ్లు, స్వల్పకాలిక రకాలైతే 50 కంటే ఎక్కువ కుదుళ్లు ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు లేత నారును నాటుకోవడం మంచిది.
దుక్కిలోనే మొదటి దఫా ఎరువులు..
పొలాన్ని దున్నిన తర్వాత దమ్ము చేయాలి. బాగా దమ్ము చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు. అంతేకాకుండా కలుపు అదుపులో ఉంటుంది. పైరు అంతటికీ నీరు సమానంగా అందుతుంది. చివరి దమ్ములోనే నత్రజని, భాస్వరం, పొటాష్ను మొదటి దఫాగా వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులను వాడదల్చుకుంటే వాటిని దుక్కిలోనే వేసుకోవడం మంచిది. దమ్ములో జింక్, భాస్వరం ఎరువులను ఒకేసారి కాకుండా 2-3రోజుల తేడాతో వేయాలి.
కాలి బాటలు తప్పనిసరి..
నాట్లు వేసేటప్పుడు, వేసిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీస్తే పైరుకు గాలి, వెలుతురు బాగా తగులుతాయి. చీడపీడల ఉధృతి కొంత వరకు తగ్గుతుంది. ఎరువులు వేయడం, చీడపీడలు, కలుపు నివారణకు మందులు పిచికారీ చేయడం, పైరు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం తేలికవుతుంది.
నీటి యాజమాన్యం
నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిలకలు సకాలంలో వచ్చి దిగుబడి బాగా ఉంటుంది. నాటు వేసిన నాటి నుంచి పైరు మూస తిరిగే వరకు అంటే 20 రోజులపాటు పొలంలో పలుచగా నీరు ఉంచాలి. పొలంలో నీరు తగిన మోతాదులో ఉంటే సుడిదోమ, లద్దె పురుగుల తాకిడి పెద్దగా ఉండదు. తడి ఆరిపోతే కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి. ఎరువులు వేసేటప్పుడు పొలంలో నీరు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.