పాలనలో నూతన అధ్యాయం సృష్టించిన దార్శనికుడు
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు
కేసీఆర్ పాలన దేశవ్యాప్తం కావాలన్నది ప్రజల ఆకాంక్ష
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధన మొదలుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వరకూ లక్ష్య సాధనలో అవిశ్రాంత శ్రామికుడని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాల్లో భాగంగా బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. లక్ష్య సాధనలో ఉద్యమాన్ని ప్రారంభించి ఫలితాన్ని అందుకున్న అతి కొద్ది మందిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు అంటూ దివంగత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అటువంటి మహానేత నాయకత్వాన్ని ప్రస్తుతం యావత్ భారతదేశం కోరుకుంటుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పరిపాలన కొనసాగిస్తూ కొత్త ఒరవడిని దేశానికి అందించిన దార్శనికుడు అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘనంగా జరుపుకొంటున్నారని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి తెలంగాణ నుంచి ఆకలి, దారిద్య్రాన్ని పారదోలిన మహానేత కేసీఆర్ అని, అటువంటి మహానేత నాయకత్వంలో పని చేస్తున్నందుకు టీఆర్ఎస్ శ్రేణులు, అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలు అందుకున్న ప్రజలు గర్వ పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితాదేవీ ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్, గండూరి ప్రకాశ్, కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్న, వేణుగోపాల్రెడ్డి, అనిల్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.