నల్లగొండ ప్రతినిధి, జూలై27(నమస్తే తెలంగాణ) : అన్నదాత ఆశల సౌధం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈ ఏడాదీ నిండే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారగా.. భారీగా వస్తున్న వరద శ్రీశైలానికి చేరుకుంటున్నది. నేడో, రేపో క్రస్టు గేట్ల ద్వారా దుంకుతూ సాగర్ దిశగా పరుగులు తీయనున్నది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 3,98,228 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా గడిచిన నాలుగు రోజులుగా ఇదే స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. దాంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు 24గంటల్లోనే 24టీఎంసీల నీరు శ్రీశైలానికి చేరింది. మరో 9అడుగుల మేర 43టీఎంసీల నీరు వస్తే పూర్తిగా నిండనుంది. ప్రస్తుతం 215.80టీఎంసీల పూర్థి స్థాయి నీటి సామర్థ్ధ్యానికి గాను 172.66టీఎంసీలు, నీటిమట్టం 885అడుగులకు గాను 876.60 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో శ్రీశైలం క్రస్టు గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విద్యుత్ ఉత్పాదనతో…
రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం శ్రీశైలం నుంచి సాగర్కు నీరు రావాలంటే పూర్తిగా నిండి గేట్లు ఎత్తితేనే సాధ్యమయ్యేది. కానీ, నేడు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానీటి వాటా విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి రాక మొదలైన నాటి నుంచే ఎడమగట్టు కేంద్రం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీంతో ఇప్పటికే సాగర్లో 10అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. సరిగ్గా గతేడాది జూలై 27న కూడా ఇంచుమించు ఇదే నీటిమట్టం నమోదు కావడం విశేషం. అక్టోబర్ వరకూ వరద ఉంటుందనే అంచనాల నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు సైతం పూర్తిస్థాయిలో నిండే అవకాశాలున్నాయి. సాగర్ ఆయకట్టుతో పాటు ఏఎమ్మార్పీ, వరదకాల్వ కింద రెండు పంటలకు ఢోకా లేనట్లే అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి పరవళ్లు…
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాలో పరవళ్లు తొక్కుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాల్వల పరిధిలోని ఆయకట్టు రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. గతేడాది పూర్తిగా రెండు పంటలకు నీరందించగా ఈ సారి కూడా నీటి విడుదల కొనసాగనుంది. ఇక ఇదే సమయంలో మూసీ ప్రాజెక్టుకు సైతం వరద కొనసాగుతుండడంతో 3 గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలకు పక్షం రోజులుగా నీటి విడుదల కొనసాగుతున్నది.
మూడు క్రస్ట్ గేట్ల మూసివేత
కేతేపల్లి, జూలై 27 : మూసీ ప్రాజెక్టు క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల నిలిచిపోయింది. ఈ నెల 14న గేట్లను ఎత్తిన అధికారులు మంగళవారం సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టడంతో మూసివేశారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 515.60 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. కుడి, ఎడమ కాల్వలకు 388క్యూసెక్కుల నీటిని వదులుతుండగా 60 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 638.05(2.79 టీఎంసీలు) అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.14రోజుల వ్యవధిలో ప్రాజెక్టు నుంచి 6.60 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు చరిత్రలో జూలై నెలలో ఈ స్థాయిలో దిగువకు నీటిని వదలడం ఇదే ప్రథమం.
నాగార్జునసాగర్ సమాచారం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను మంగళవారం నాటికి 539.70 అడుగుల వద్ద 187.4952 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 4,111, ఎస్ఎల్బీసీ ద్వారా 1000క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్కు 35,315 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి
పులిచింతల ప్రాజెక్టు వద్ద 2యూనిట్ల ద్వారా 30మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175.00(45.77 టీఎంసీలు) అడుగులకు గాను 173.489 (43.4506 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,667 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. విద్యుత్ కేంద్రం గేట్ల నుంచి 5,000 క్యూసెక్కుల నీరు, గేట్ల లీకేజీల ద్వారా 600 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.