రామగిరి, జనవరి 17: సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయలు ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదీలకు ప్రభుత్వం గీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరా బాద్లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆమోదం తెలిపిన విషయం విధితమే. దీంతో ఆయా అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఈ వారంలోనే వెల్లడించే దిశగా సర్కారు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది. జీవో విడుదల కాగానే ఇక ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. అదేవిధంగా 2020-21 విద్యా సంవత్సరంలో ఆగస్టు 2020లో యూడైస్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే టీచర్ల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) విద్యాశాఖ పూర్తి చేసింది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,971 మంది ఉపాధ్యాయులంతా ఆయా ప్రాంతాల్లో ఒకేచోట పనిచేస్తూ లాంగ్ స్టాండ్లో 8 ఏండ్లు పూర్తి చేసుకుని బదిలీలకు సిద్ధంగా 8 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. 2015లో పదోన్నతులు, సాధారణ బదిలీలు నిర్వహించగా, 2018లో వెబ్ కౌన్సిలింగ్ దార్వా బదిలీలు జరిగాయి.
అదే విధంగా కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయులకు సైతం బదిలీలు నిర్వహిస్తామని ప్రభు త్వం ప్రకటించంది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు సర్వత్రా హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓలతో మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వర్చువల్ సమావేశం నిర్వహించి అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయులకు 2015 జూన్లో బదిలీలకై జీవో విడుదల చేయగా అదే సందర్భంలో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియను సైతం నిర్వహిస్తూ పదోన్నతులు, బదిలీలు చేశారు. అయితే పదోన్నతులు మాత్రం ఇప్పటివరకు జరగలేదు. మళ్లీ జూన్ 2018లో వెబ్ కౌన్సిలింగ్తో అందరికీ అవకాశం కల్పిస్తూ బదిలీలు నిర్వహించగా 8 ఏండ్ల సర్వీసు ఒకేచోట పూర్తి చేసిన వారు తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీకాగా కొంతమంది అవకాశం వినియోగించుకున్నారు. అయితే 2020-21 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ యూడైస్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాలతో విద్యాశాఖ పూర్తి చేసింది. తాజాగా సుదీర్ఘ కాలం తర్వాత పదోన్నతులకు, బదిలీలకు ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేషనలైజేషన్ సమస్య తలెత్తకుండా టీచర్ల సీనియార్టీ తేడా రాకుండా ఇప్పటికే అందరి ఉపాధ్యాయులు వివరాలు టీచర్ ఇన్ఫోతో ఆన్లైన్లో భద్రపరిచారు. దాంతో ప్రక్రియ సజావుగా ముగిసే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పేరొంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11,971 మంది ఉపాధ్యాయులు వివిధ కేటగీరిల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఒకే చోట 8 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు దాదాపు 8 వేల మం దికిపైగా ఉంటారని విద్యాశాఖ నివేదికలు, ఉపాధ్యాయ సంఘాల నేతల సమాచారంతో తెలుస్తున్నది. వీరంతా బదిలీ కావాల్సి ఉంటుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ లెక్కల ప్రకారం 3,120 పాఠశాలల్లో 11,971 మంది ఉపాధ్యాయులు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 5,388, సూర్యాపేట జిల్లాలో 3,680, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2903 మంది ఉన్నారు. వీరిలో 299 (జీహెచ్ఎం-II)మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుండగా వారిలో నల్లగొండ జిల్లాలో 136 మంది, సూర్యాపేట జిల్లాలో 84, యాదాద్రిలో 79 మంది ఉన్నారు. అయితే 317 జీవోతో కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయుల సర్ధుబాటు జరిగిన విషయం విధితమే కాగా వీరి సంఖ్యలో స్వల్పమార్పులు ఉండే అవకాశం ఉన్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 కస్తూర్బా పాఠశా లలు ఉండగా 654మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీటిలో నల్లగొండ జిల్లాలో 27 పాఠశాలల్లో 282 మంది, సూర్యాపేట జిల్లాలో 18 పాఠశాలల్లో 191మంది, యాదాద్రిభువనగిరి జిల్లాలో 14 పాఠశాలల్లో 159 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ నల్లగొండలో 17 పాఠశాలలు ఉండగా వీటిలో 331 మంది ఉపాధ్యాయులు, సూర్యాపేట జిల్లాలో ఉండగా 143 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 పాఠశాలలుండగా వీటిలో 102 మంది టీచర్లు ఉన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ వారంలోనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలవుతుందని, అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు అంతా సిద్ధం చేయాలని సూచించారు. సీనియార్టీ, ఖాళీలు ఇతర అంశాలతో జాబితాలు తయారు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
డీఈలు తొలుత ఆయా కేటగిరీల వారీగా జాబితాలను వెల్లడిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులకు 4 రోజులు, హర్డ్కాపీలు అందజేయడానికి 3 రోజులు, తర్వాత వాటిని పరిశీలనకు మూడు రోజులు, అభ్యంతరాల స్వీకరణకు ఒక రోజు గడువు ఇస్తారని తెలుస్తున్నది. అదే విధంగా పదోన్నతులకు 10రోజులు అవకాశం ఇస్తారని సమాచారం.
సుదీర్ఘ కాలం తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ప్రభు త్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఎలాంటి అవకతవకులు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలి. అదే విధంగా 317 జీవోతో వచ్చిన ఉపాధ్యాయులను క్రోడికరించుకుని అందరికీ న్యాయం చేసేలా పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టాలి. సీఎం కేసీఆర్, విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు కృతజ్ఞతలు.
– సుంకరి భిక్షంగౌడ్, పీఆర్టీయూటీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
2018లో నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్ తర్వాత మళ్లీ బదిలీలు కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించడం హర్షణీయం. ఇందుకోసం ఎన్నో ఏండ్లుగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. జీఓను, షెడ్యూల్స్ను త్వరగా విడుదల చేసి సకాలంలో పూర్తి చేయాలని కోరుతున్నాం. అభ్యంతరాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సజావుగా పూర్తి చేయాలి.
– ఎడ్ల సైదులు, టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు