కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 15 : దళిత బంధు పథకం లబ్ధిదారులకు యూనిట్ల ఎంపికలో అధికారులు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, మండల బృందాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని తెలిపారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను తీయించాలని సూచించారు. ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రత్యేక అధికారులు, మండలస్థాయి బృందాలు సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలన్నారు. దళిత బంధుకు సంబంధించిన రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు అందించాలని ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, పాటిల్ హేమంత్ కేశవ్, జడ్పీ సీఈఓ సురేశ్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శిరీష, పీడీ కిరణ్ కుమార్, డీఏఓ రామారావు నాయక్, గిరిజన సంక్షేమ అధికారి శంకర్, వివిధ శాఖల అధికారులు, తాసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.