నల్లగొండ ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగాణ) : జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయటానికి ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖలకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఐకేపీ 128, పీఏసీఎస్ 112, మార్కెటింగ్ శాఖ 8 కేంద్రాల చొప్పున మొత్తంగా 248 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,12,290 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 1,38,134, మార్కెటింగ్ శాఖ ద్వారా 15,240 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తంగా 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వర్షాలతో ధాన్యం తడవకుండా ఉండటానికి కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రవాణా చేస్తూ మిల్లులకు చేర్చుతున్నారు. గన్నీ బ్యాగుల విషయంలో సమస్య రాకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. క్వింటాకు రూ.1,960 చొప్పున మొత్తంగా ఇప్పటి వరకు 43,094 మంది రైతుల నుంచి రూ.520 కోట్ల విలువైన ధాన్యం సేకరించిన అధికారులు రూ.277 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం సేకరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు పౌర సరఫరాలు, సివిల్ సప్లయ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, రెవెన్యూ, పోలీస్, రవాణా, తూనికలు-కొలతల శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది మొత్తంగా సుమారు 15 వేల మంది ఈ ప్రక్రియలో భాగస్వాములై యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపడుతున్నారు.
ఈ నెలాఖరు నాటికి సేకరణ పూర్తి..
జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన యంత్రాంగం ఈ నెల చివరి నాటికి పూర్తి చేసి కేంద్రాలను మూసి వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. జూన్ నుంచి వాన కాలం సీజన్ షురూ కానుండడంతో పాటు ఈ సారి ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. కొనుగోలు కేంద్రా ల్లో 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని సం బంధిత ఏఈఓ పరిశీలించిన తర్వాత కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు, రైతు పేరుతో సహా ట్యాబ్లో ఎంట్రీ చేయాల్సి ఉంది. ఈ ట్యాబ్ ఎంట్రీ పూర్తి అయిన రెండు మూడు రోజుల్లోనే డబ్బులు రైతు ల ఖాతాల్లో జమ అయ్యేలా సివిల్ సప్లయ్ శాఖ చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు రూ.520 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా క్షేత్రస్థాయిలో రూ.283 కోట్లకు సంబంధించిన బిల్లులు ఆ శాఖకు అందాయి. అందులో ఇప్పటివరకు రూ.277 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే ట్యాబ్ ఎంట్రీలో ఆలస్యం జరుగుతుండటంతో వేగవంతం చేయాలని అదికారులు నిర్వాహకులకు ఆదేశాలు చేశారు.
వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడే సేకరణ చేయటం వల్ల త్వరగా పూర్తి అవుతుంది. క్షేత్రస్థాయిలో ధాన్యం కొన్న తర్వాత ట్యాబ్ ఎంట్రీ చేసిన రెండు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం. కొన్న ధాన్యం కూడా కేంద్రాల్లో ఉంచకుండా రవాణా చేసి మిల్లుల్లో దిగుమతి చేస్తున్నాం. దొడ్డు ధాన్యంతో పాటు సన్న ధాన్యం కూడా తేమ శాతం రాగానే ఆపకుండా కొంటున్నాం. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది జరుగకుండా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి గింజా కొనే విధంగా చర్యలు చేపడుతున్నాం. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, నల్లగొండ