సూర్యాపేట, జూలై 19 (నమస్తే తెలంగాణ) : కరోనా బారిన పడకుండా ఉండాలంటే నిబంధనలు పాటించాల్సిందే. అందులో భాగంగా ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. కానీ ప్రజలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే మాస్క్ వేసుకోని వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16న జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ మాస్క్ వేసుకోని వారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి రోజూ 400 నుంచి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఆరు రోజుల్లోనే 3,362 కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా కూడా విధించారు. సెకెండ్ వేవ్లో జిల్లా వ్యాప్తంగా 17,800 కేసులు నమోదు చేశారు.
మరింత కఠినంగా
మొదటి సారి మాస్క్ లేకుండా పట్టుబడితే రూ. వెయ్యి జరిమానా, రెండో సారి దొరికితే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టం కింద కేసు నమోదు, మూడోసారి కూడా పట్టుబడితే జైలుకే పంపిస్తామని ఎస్పీ భాస్కరన్ హెచ్చరిస్తున్నారు. నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు మూడో విడుత జ్వరసర్వే చేపడుతూ లక్షణాలు ఉన్న వారికి మందులు అందిస్తూ.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
పెరిగిన నిర్లక్ష్యం
సెకండ్ వేవ్ అనంతరం కేసులు తగ్గడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసింది. అయినా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా.. ఇటీవల చాలా మంది మాస్క్లు లేకుండా, కనీసం దూరం పాటించకుండా తిరుగుతున్నారు. ఫలితంగా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. 15 రోజుల క్రితం వరకు జిల్లాలో 100 నుంచి 120 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 130 నుంచి 140 వరకు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 808 టీంలు సర్వేలో పాల్గొంటున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు ఇతర సీజనల్ వ్యాధులు ఉన్న వారికి మందుల కిట్లు అందజేస్తున్నాయి.
నల్లగొండలో 13,272 కేసులు
నీలగిరి : కొవిడ్ నిబంధనలు పాటించని వారి విషయంలో నల్లగొండ జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా నిఘా ఏర్పా టు చేసి మాస్కులు ధరించకుండా, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కరోన వైరస్ రెండో దశ తీవ్రతరమైన తర్వాత మే 12 నుంచి జూన్ 19 వరకు నిబంధనలు పాటించని వారిపై జిల్లాలో 1829 ఈ చలాన్లు, 1973 కేసులు నమోదు చేశారు. జూన్ 20 నుంచి లాక్డౌన్ను సడలించగా అప్పటి నుంచి జూలై 19 వరకు నెల రోజుల వ్యవధిలో జిల్లా పోలీసులు మరింత కఠినంగా వ్యహరించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 8,232 ఈ చలాన్లు, 5,040 ఈపెట్టి కేసులు, మొత్తం 13,272 కేసులు నమోదు చేశారు. ఇందులో ఆరు రోజుల్లోనే 4,080 కేసులు నమోదయ్యాయి.
నిబంధనలు పాటించకుంటే కేసు
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగకుండా ఉండేందుకు ప్రజలను చైతన్యపరుస్తున్నాం. మాస్క్లు లేకుండా బయటకు వస్తే జరిమానా విధించడంతోపాటు కేసు నమోదు చేస్తాం. కట్టడి చేయడంలో కఠినంగా ఉండక తప్పడం లేదు. ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు బాధ్యతగా వ్యవహరించి పోలీసులతో సహకరించాలి.
– డీఐజీ రంగనాథ్
నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు
కొవిడ్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు. మాస్క్ వేసుకోకుంటే పోలీసులు వేసేది వెయ్యి జరిమానా మాత్రమే. కానీ కొవిడ్ సోకితే ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో గుర్తించాలి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, భౌతిక దూరం పాటించాలి. అప్రమత్తంగా ఉండని వారి పట్ల పోలీసులు మరింత కఠినంగా వ్యహరిస్తారు. కేసులు నమోదు చేస్తారు.
అప్రమత్తత అవసరం
రోజువారీ అలవాట్లు మార్చుకొని కొవిడ్ నిబంధనలు పాటిస్తే కరోనా మాత్రమే కాదు ఇతర వ్యాధులు కూడా దరిచేరవు. కరోనా కేసు లు తగ్గితే వైరస్ పోయిందని అనుకోవద్దు. వ్యా క్సిన్ తీసుకున్న వారికి కూడా కొవిడ్ వస్తుంది. కాకపోతే తీవ్రత అంతగా ఉండడం లేదు. అందుకే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి నిబంధనలు పాటించాలి.