విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
జడ్పీ సమావేశంలో విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 16 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదల గడపకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ టి. వినయ్కృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.7,289 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వం రైతుబంధుతో పాటు దళితబంధు పథకానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి. వినయ్కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులను పెంచాలని, ఆదిశగా వైద్యాధికారులు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెంచామని, అవసరానికి మించి వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద మొదట దఫాలో 329 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారికి సంబంధించిన 1000 దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 820 పరిష్కరించినట్లు, మిగతావి కూడా త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలోని దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధిని ఆయా శాఖల అధికారులు వివరించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ నేపథ్యంలో 1074 బృందాలను ఏర్పాటు చేసి రెండో విడుత జ్వర సర్వేను చేపట్టినట్లు తెలిపారు. 4245మందికి కేసీఆర్ కిట్లను అందించినట్లు తెలిపారు. మిషన్ భగీరథ అధికారులు మాట్లాడుతూ జిల్లాలో పైప్లైన్ల కోసం తవ్విన రోడ్లను మార్చి చివరి నాటికి మరమ్మతు చేస్తామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, అన్ని సొసైటీల ద్వారా రైతులకు అందిస్తామన్నారు. మిర్యాలగూడ నుంచి రెండు పైపులైన్ల ద్వారా హుజూర్నగర్కు నీరు సరిగా సరఫరా కావడం లేదని, వేసవిని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. అనంతరం ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులు వివరణ ఇచ్చి త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు.
కేక్ కట్ చేసిన మంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కేక్ కట్ చేశారు. జడ్పీ ఆవరణలో ఎమ్మెల్యేలతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, శానంపూడి సైదిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, సీఈఓ సురేశ్, పీడీ కిరణ్కుమార్, డీఎఓ రామారావు నాయక్, సంక్షేమ అధికారులు శిరీష, శంకర్, దయానందరాణి, వివిధ శాఖల అధికారులు, ఎంపీపీటు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.