అడవిదేవులపల్లి, జూలై13: కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి ఉపేందర్ సూచించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వర సర్వే కోసం వచ్చే సిబ్బందికి ప్రజలు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని సూచించారు. సర్వేలో భాగంగా 168 మందికి కరోనా పరీక్షలు చేయగా 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, వైద్య సిబ్బంది ఉన్నారు.
ముమ్మరంగా జ్వర సర్వే
మాడ్గులపల్లి : మండలంలోని పాములపహాడ్, చిరుమర్తి, పోరెడ్డిగూడెం గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించినట్లు పీహెచ్సీ వైద్యుడు సతీశ్ తెలిపారు. ఆయా గ్రామాల్లో 240 మంది వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న వారికి మందులు ఇచ్చినట్లు చెప్పారు.
హాలియా : అనుముల మండలంలో ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతున్నది. మంగళవారం రెండో రోజు 3400 ఇండ్లల్లో సర్వే నిర్వహించారు. కొవిడ్ లక్షణాలున్న 20 మందిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది సైదులు, ఎండీ. జావెద్, హెల్త్ అసిస్టేంట్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.కట్టంగూర్ : మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.చిట్యాల : మండలంలో 53 బృందాలు అన్ని గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహిస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి కిట్లు అందిజేస్తున్నట్లు వైద్యాధికారి కిరణ్కుమార్ తెలిపారు. మూడు రోజుల అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.