గండీడ్ /మహ్మదాబాద్, జూన్ 19: ప్రత్యేక మండలం ఏర్పాటుకు ఎదురుచూస్తున్న మహ్మదాబాద్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి చొరవతో ఏర్పాటైంది. దీంతో పరిపాలన సౌలభ్యం, అభివృద్ధికి మార్గం సుగమం అయ్యింది. గతంలో రంగారెడ్డి జిల్లాలో గండీడ్ మండలం భౌగోళికంగా పెద్ద మండలంగా ఉండేది. 49 గ్రామపంచాయతీలు 20 రెవెన్యూ గ్రామాలు 70వేల జనాభా ఉండేది. గండీడ్ మండల కేంద్రానికి ఈ ప్రాంత గ్రామాలకు దూరంగా ఉండడంతో మహ్మదాబాద్ ప్రాంతం నుంచి వచ్చేవారు ఇబ్బందులు పడేవారు. అంతేగాక ఈ ప్రాంతంలో గిరిజన తండాలు ఎక్కువగా ఉండడంతో గండీడ్ మండల కే్రందానికి రావాలంటే దాదాపు 20కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సిందే.. అతిపెద్ద మండలంగా ఉన్న గండీడ్ను రెండు మండలాలుగా ఏర్పాటు చేయాలని విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే, మంత్రుల దృష్టి తీసుకొస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు గండీడ్ మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని పలు మార్లు విన్నవించారు. గతంలో రెవెన్యూ మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మండలం ఏర్పాటుకు ఎంతగానో కృషిచేసినా అప్పట్లో సాధ్యం కాలేదు. పరిగి నియోజకవర్గంలో కుల్కచర్ల మండలంలో చౌడాపూర్ను, గండీడ్ మండలంలోని మహ్మదాబాద్ను మండలాలుగా ఏర్పాటు చేయాడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 57కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గండీడ్ మండలానికి 27 పంచాయతీలు కేటాయించగా మహ్మదాబాద్ మండలానికి 22 గ్రామ పంచాయతీలు, 6 అనుబంధ గ్రామాలు, 10రెవెన్యూ గ్రామాలతో ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహ్మదాబాద్ మండలంలో 30వేల జనాభాతో 22వేల ఓటర్లు ఉన్నారు. నాలుగు ఉన్నత పాఠశాలలు, 40 ప్రాథమిక పాఠశాలలు, కస్తుర్బా గురుకుల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు ఐదు హాస్టల్స్ 5 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా సుమారు 5వేల మంది విద్యార్థులు ఆయా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు.
మహ్మదాబాద్, నంచర్ల గ్రామాల్లో ఎస్బీఐతోపాటు కోఆపరేటీవ్ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పటికే పోలీస్స్టేషన్, అటవీశాఖ, పీహెచ్సీ ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. తాసిల్దార్, వ్యవసాయశాఖ, విద్యావనరుల కార్యాలయాలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. వీటి భవనాలను నిర్మించేందుకు అధికారులు స్థలాలను, నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు మహ్మదాబాద్ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల కేంద్రంలో వ్యాపారపరంగా దినదిన అభివృద్ధి జరుగుతున్నది. మే 10న మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి చేతుల మీదుగా మహ్మదాబాద్ నూతన మండలాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యే రుణం తీర్చుకోలేం
కొత్త మండలం ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి రుణం తీర్చుకోలేం. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్తో అనేకసార్లు చర్చించి మండలంగా ఏర్పాటు చేయించారు. ప్రత్యేక మండలం ప్రజలకు వరం. ఆయనను మండల ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. – నీలేష్, సర్పంచ్, ముందలితండా
తక్కువ సమయంలో పూర్తి
మండల కేంద్రం దగ్గర కావడంతో తక్కువ సమయంలో పనులు జరుగుతున్నాయి. మండల కేంద్రానికి 15నిమిషాల్లో చేరుకుంటున్నాం. పరిపాలన పరంగా ఇబ్బందులు తొలగిపోయాయి. ఇంకా పూర్తిస్థాయిలో అధికారులను ఏర్పాటు చేసి అన్ని కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలి.