యాదాద్రి భువనగిరి, మార్చి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని రంగాల ప్రజల సంక్షేమానికి అద్దంపట్టేలా తెలంగాణ ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్కు రూపకల్పన చేసింది. రుణమాఫీ అమలుకు సిద్ధమైన ప్రభు త్వం ఈమేరకు రూ.లక్ష వరకు రుణమాఫీని నాలుగు విడుతల్లో చేయనున్నది. రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికల నిర్మాణం, సాగునీటి పారుదల రంగానికి నిధుల కేటాయింపు..ఇలా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దపీట వేసింది. జిల్లాకే మణిహారం లాంటి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం బడ్జెట్లో రూ. 750కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్ల కేటాయింపులు జరపడంతో నృసింహ(బస్వాపూర్) రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రూ. 500కోట్ల నిధు లు రానుండగా.. నవంబర్ నాటికి రిజర్వాయర్ను అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరనున్నది. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ, ఎన్నికల బడ్జెట్ తరహాలోనే అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా బడ్జెట్ను రూపొందించడంతో సబ్బండ వర్ణాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
నృసింహ రిజర్వాయర్కు రూ.500కోట్ల కేటాయింపులు..
సాగునీటి రంగానికి ప్రస్తుత వార్షిక బడ్జెట్లో రూ.16,931కోట్ల కేటాయింపులు జరిపారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాకే తలమానికంగా ఉన్న నృసింహ(బస్వాపురం) రిజర్వాయర్ నిర్మాణం పూర్తిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి 1.5టీఎంసీల నీటి నిల్వ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో భూసేకరణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుం డా పరిహారం చెల్లింపుల్లోనూ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. భూములు కోల్పోతున్న బస్వాపూర్, తిమ్మాపురం, వడపర్తి గ్రామాల పరిధిలోని 450 ఎకరాలకు సంబంధించి రూ.70కోట్ల పరిహారం చెల్లింపులు గతంలోనే పూర్తవ్వగా.. జం గంపల్లి, లప్పనాయక్తండాల పరిధిలోని 230 ఎకరాలకు సం బంధించి పరిహారం చెల్లించాల్సి ఉంది. జలాశయం కట్టను 495 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తుండగా 472 ఎత్తువరకు పనులు పూర్తి అయ్యాయి. మిగతా 23 మీటర్ల ఎత్తు పనులు పురోగతిలో ఉన్నాయి. 1.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యానికి అనుగుణంగా నిర్మిస్తున్న జలాశయం కట్ట నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరిస్తున్నది. భువనగిరి మండలంలోని బీఎన్ తిమ్మాపురంలో 60 ఎకరాలు, యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి 121 ఎకరాల భూమి అవసరం పడుతుండ గా.. రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రభు త్వం పరిహారం చెల్లింపుల కోసం రూ.70.8 కోట్లను విడుదల చేసింది. మరోపక్క పునరావాస ప్రక్రియను సైతం అధికారులు వేగవంతం చేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.500కోట్ల వరకు కేటాయింపులు జరపనుండడంతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల కొరత ఉండదు.
రీజినల్ రింగ్రోడ్డు కల సాకారం
రీజినల్ రింగ్రోడ్డు భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.750 కోట్లను వార్షిక బడ్జెట్లో కేటాయించి ప్రజల ఆశలను సజీవంగా నిలిపింది. దీంతో భూసేకరణ ప్రక్రియ ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగనుంది. హైదరాబాద్తో అనుసంధానమయ్యే జాతీయ రహదారులను కలుపుతూ 338కి.మీ.ల మేర నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 13వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మొదటిదశలో 152కి.మీ.ల మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు కార్యరూపంలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారులతో రవాణాపరంగా చాలా వరకు ఇబ్బందులు తీరా యి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా యాదాద్రి ఆలయం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లాలో ఉన్న జాతీయ రోడ్లు ఆలంబనగా పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రియల్ రంగం ఊపందుకోగా.. ఉపాధి అవకాశాలు సైతం పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్డు సైతం దగ్గరలోనే ఉండటంతో జిల్లా మీదుగా ఇతర రాష్ర్టాలకు రాకపోకలు సైతం సులభతరంగా మారింది. హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య సైతం చాలావరకు తీరింది. ఈ క్రమంలో రీజినల్ రింగ్ రోడ్డు త్వరలోనే సాకారం అయితే భవిష్యత్తులో జిల్లా రూపురేఖల్లో సమూలంగా మార్పులు రానున్నాయి.