ప్రత్యేకప్రతినిధి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, కరోనా ప్రళయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ను వాస్తవ అంచనాలతో రూపకల్పన చేసినట్టు తెలుస్తున్నది. సాధారణ అంచనా.. ఎక్కువ కార్యసాధన అన్న సూత్రంతో బడ్జెట్ను సిద్ధంచేసినట్టు సమాచారం. ఉద్యోగులు, నిరుద్యోగులతోపాటు సకల జనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ బడ్జెట్కు తుది రూపమిచ్చినట్టు తెలిసింది. ప్రగతి పద్దు (స్కీమ్ ఎక్స్పెండీచర్), నిర్వహణ పద్దు (ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండీచర్) కింద ఆచితూచి లెక్కలు వేసి.. పైసా పైసాను పక్కాగా లెక్కించి అంచనాలను తయారుచేశారు. ఈసారి రెవెన్యూ రాబడులతోపాటు ఖర్చులు కూడా పెరుగనున్నాయి. పీఆర్సీ ప్రకటన, అన్నిరకాల ఉద్యోగులకు జీతభత్యాల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండటంతో రెవెన్యూ వ్యయం భారీగా పెరుగనున్నది. అదేస్థాయిలో రాబడులను పెంచడంపై ప్రణాళిక సిద్ధమైంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లోనూ రెవెన్యూ మిగులు చూపే అవకాశమున్నది. అటు ఆర్థిక మాంద్యాన్ని, ఇటు కరోనా సంక్షోభాన్ని తట్టుకుని తెలంగాణ వేగంగా కోలుకుంటున్నది. రాష్ట్ర సొంత రాబడులపై కరోనా ప్రతికూల ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో అక్కడి నుంచి రావాల్సిన నిధులకు భారీగా గండిపడింది. దీంతో 2020-21లో అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాలేదు. మార్చి నెలాఖరు నాటికి రెవెన్యూ, క్యాపిటల్ రాబడులు కలిపి రూ.1,76,393 కోట్లు అంచనా వేయగా.. జనవరి నెలాఖరుకు రూ. 1,18,977 కోట్లు (67శాతం)కే పరిమితమైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో రెవెన్యూ రాబడులు రూ. 1,43,151కోట్ల అంచనాకు రూ.74,990 కోట్లు (52శాతం)గానే ఉన్నది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.17వేల కోట్లుగా ఉంటుందని భావించగా.. రూ.9,587 కోట్లు (52 శాతం)కు పరిమితమైంది. అన్నిరకాల రెవెన్యూ పన్నుల రాబడి ద్వారా రూ.1,02,026 కోట్లకుగాను రూ.60,424 (60 శాతం)గానే ఉన్నది. గతేడాది ఇదే సమయానికి అన్నిరకాల పన్నుల ద్వారా రాబడి రూ.65వేల కోట్లుగా ఉన్నది. అయితే, కరోనా సంక్షోభాన్ని అధిగమించి గత మూడునెలలుగా రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరుగుతుండటం కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది. దీనినిబట్టి 2021-22లోనూ రాబడులు భారీగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదే ఆశాభావంతో ప్రభుత్వం వాస్తవ అంచనాలతో భారీ బడ్జెట్ దిశలో అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో మొదటినుంచీ పక్కా విధానాన్ని అనుసరిస్తున్నది. కాకిలెక్కలు వేయకుండా పరిస్థితులకు తగ్గట్టు అవసరమైతే బడ్జెట్ సైజును కూడా తగ్గించిన సందర్భాలున్నాయి. 2019-20లో ఆర్థికమాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి బడ్జెట్ను భారీగా తగ్గించి రూ.1.46 లక్షల కోట్లకు పరిమితం చేశారు. అంతకుముందు ఏడాది బడ్జెట్ రూ.1.74 లక్షల కోట్లుగా ఉన్నది.