సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): వానకాలం ప్రారంభమవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలడం సహజం. కానీ ఇది కరోనా కాలం. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వచ్చినా ఇటు వైద్యుల్లో ఇటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా డెంగీ, కరోనా లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉండటం ఇందుకు కారణం. అయితే రోగి లక్షణాల ఆధారంగా ఏది కరోనానో, ఏది డెంగీనో అంచనా వేయవచ్చంటున్నారు వైద్యనిపుణులు. రోగి లక్షణాలను కచ్చితంగా పరిశీలించడంతో పాటు కాంటాక్ట్ హిస్టరీతో ఈ రెండింటిని గుర్తించవచ్చంటున్నారు. కరోనా, డెంగీ సోకితే జ్వరం సాధారణ లక్షణమని వైద్యులు వివరిస్తున్నారు. అయితే కరోనా ప్రధానంగా రోగిలోని శ్వాసకోస వ్యవస్థపై ప్రభావం చూపుతుండగా.. డెంగీ మాత్రం రక్తంలోని ప్లేట్లెట్స్ పడిపోయేలా చేస్తుందంటున్నారు. సాధారణంగా వైరల్ ఫీవర్స్ను గుర్తించేందుకు సీబీపీని నిర్వహిస్తారు. ఇందులో న్యూట్రోఫిల్స్/లింపోసైడ్స్(N/L)శాతం 2 కంటే తక్కువగా వస్తే సదరు రోగికి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లు గుర్తిస్తారు. అది ఏ రకమైన వైరల్ ఇన్ఫెక్షనో తెలుసుకునేందుకు ముందుగా యాంటీబాడీ టెస్ట్, పీసీఆర్ పరీక్ష జరిపిస్తే ఏది కరోనానో ఏది డెంగీనో తేలిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా, డెంగీ రెండూ వేర్వేరు వైరస్ల ద్వారా సంక్రమిస్తాయి. వీటిలో కొన్ని లక్షణాలు మాత్రమే ఒకేలా ఉంటాయి. రోగి లక్షణాల ఆధారంగా డెంగీ, కరోనాను గుర్తించవచ్చు. కాకపోతే ఈ రెండింటిలో జ్వరం అనేది సాధారణ లక్షణం. అయితే రోగి లక్షణాల ఆధారంగా వైద్యం అందించాల్సి ఉంటుంది. మూడు రోజులు మందులు వాడినా తగ్గకపోతే అది కరోనాగా అనుమానించాల్సి వస్తోంది. రెండు వ్యాధులు కలిసి వస్తే ప్రమాదమనే చెప్పాలి. మొత్తానికి ఈ సీజన్లో అప్రమత్తంగా ఉంచాలి. – డాక్టర్ శంకర్(సూపరింటెండెంట్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్)