మేడ్చల్/సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ పూర్తయింది. జిల్లాలో మొత్తం 53,123 మంది అర్హులైన కార్డుదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్పీ రోడ్డులోని జోరాస్టియన్ క్లబ్లో రేషన్ (ఆహార భద్రత) కార్డులను అర్హులకు అందించనున్నారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 30055 మంది లబ్ధిదారులకు రేషన్కార్డులను అందించనున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదీగూడ, బోడుప్పల్, ఘట్కేసర్, కీసర, శామీర్పేట్, మూడుచింతలపల్లి, మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి కార్డులను పంపిణీ చేయనున్నారు. ఆగస్టు నుంచే నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం రేషన్ అందజేయనుంది.