మల్కాజిగిరి, జూలై 14: ఈనెల 6న కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ యువకుడు మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని మౌలాలి రైల్వే లోకో షెడ్డు వద్ద హత్యకు గురయ్యాడు. ముందుగా గుర్తు తెలియని యువకుడి మృతదేహంగా కేసు నమెదు చేసిన పోలీసులు అటు తర్వాత చేపట్టిన విచారణలో యువకుడిది హత్యగా తేల్చడంతో పాటు నిందితున్ని సైతం గుర్తించి రిమాండ్కు తరలించారు. మృతుడు మౌలాలికి చెందిన లింగంపల్లి అభిలాష్ అలియాస్ సోను (21)గా గుర్తించారు. ముందుగా అభిలాష్ తల్లి కొడుకును గుర్తించి తన కొడుకుది సహజ మరణం కాదని హత్య చేసినట్లుగా అనుమానించి అనుమానితుల వివరాలను పోలీసులకు చెప్పింది. ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు మాసబ్ట్యాంక్ విజయనగర్కాలనీకి చెందిన చక్కొరోల్ల భరత్ (21)ను అదుపులోకి తీసుకొని విచారించగా పాత కక్షల నేపథ్యంలో తాగిన మైకంలో అభిలాష్ను హత్యచేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న భరత్ స్నేహితుడు రమేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.