కుత్బుల్లాపూర్,జూలై 17: ‘పట్టణ ప్రగతి’లో వెలువడిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు. శనివారం కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల అధికారులు, కార్పొరేటర్లతో సర్కిల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోనల్ కమిషనర్ మమత అధ్యక్షత వహించగా ఉప కమిషనర్లు మంగతాయారు, రవీందర్కుమార్తో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో పది రోజుల పాటు చేపట్టిన పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలపై చర్చించారు. జంట సర్కిళ్ల పరిధిలో పట్టణ ప్రగతి ద్వారా వెలుగులోకి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఈ తరుణంలో సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి, పకడ్బందీగా పరిష్కరించాలని పలు సందేశాలు, సలహాలను అందించారు. అనంతరం కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పలు అంశాలను సంబంధిత అధికారులతో చర్చించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు సైనికుల్లా పని చేయాలి. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను తీసుకొచ్చే బాధ్యత నాది. పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సహకారంతో నిధుల మంజూరికి ఏమాత్రం డోకా లేదు. ప్రణాళికల మేరకు త్వరలోనే నిధులను తెప్పించుకొని సమస్యల పరిష్కారం దిశగా పని చేద్దాం.. అధికారులంతా కలిసిగట్టుగా సమన్వయంతో ముందుకు సాగాలి. బాధ్యతతో పని చేస్తే చిరకాలం ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. – కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్