మేడ్చల్, జూన్ 23(నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు ఓ వరం అని, వ్యవసాయ సాగు నిమిత్తం పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తన కార్యాలయంలో రైతు సమన్వయ సమితి సభ్యులతో బుధవారం మంత్రి మల్లారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన రైతులందరికీ రైతుబంధును అందించడంతో వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారని అన్నారు. రైతుబంధు ప్రారంభించిన నాటి నుంచి నిర్విరామంగా రైతులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం దిగ్విజయంగా అమలు జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతుబంధు అమలు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి మల్లారెడ్డి రైతు సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు.
మేడ్చల్ జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా రూ.32 కోట్ల 56 లక్షల నగదును రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటి వరకు 31,987 మంది రైతులకు రైతుబంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేశారు. రైతుబంధు పథకంతో వచ్చిన నగదును విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు వినియోగించుకుంటున్నారు.