మేడ్చల్, జూన్ 14(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఉండాలన్నారు.
అందరి సహకారం వల్ల ప్రస్తుతం జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఇది ఎంతో ఆనందకరమన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది 24 గంటల పాటు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులను మంత్రి మల్లారెడ్డి ప్రసంసించారు.
ఫీవర్ సర్వే వల్ల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రెండు శాతానికి వచ్చాయన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి, నర్సరీలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డు, రైతు వేదిక నిర్మాణాలను ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కింద వాటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీఏ అధికారిణి పద్మజారాణికి మంత్రికి ఆదేశించారు. రైతుబంధు అర్హులైన రైతులందరికి అందేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వారి ఖాతాలలో డబ్బులు జమా చేయడంలో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. బెల్ట్ షాపులు, విద్యుత్ కోత లేకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లాకు ఆర్థిక సంఘం నుంచి వివిధ అభివృద్ధి పనులకు రూ.5 కోట్ల 46 లక్షల నిధులు మంజూరైనట్లు జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మంజూరైన నిధులతో సమస్యలను గుర్తించి పనులు చేపడుతామన్నారు. ప్రజా ప్రతినిధులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సభ్యులు తీర్మాణం చేశారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్ అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్వాంసన్, జడ్పీ సీఈవో దేవ సహాయం ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.