మేడ్చల్, మే 13 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ డెస్క్ సత్ఫలితాలు ఇస్తున్నది. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా 61 మంది వైద్య సేవలు పొందారు. వైద్య సేవలు కావాలని కోరుతూ బాధితులు ఎవరైనా కంట్రోల్ రూం 9492409781, 08418297820 నంబర్లలో సంప్రదిస్తే అక్కడి సిబ్బంది స్పందించి వెంటనే బాధితులను సమీపంలోని ప్రభుత్వ దవాఖానాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేంద్రం పర్యవేక్షణ బాధ్యతలను బీసీ వెల్ఫేర్ అధికారి ఝాన్సీ, జిల్లా ఆడిట్ అధికారి వెంకటేశం, పశుసంవర్ధశాఖ జిల్లా అధికారి విజయశేఖర్ నిర్వహిస్తుండగా.. రెవెన్యూశాఖ నుంచి ముగ్గురు, వైద్యశాఖ నుంచి నలుగురు, పోలీస్శాఖ నుంచి ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు.