మేడ్చల్, కీసర, జూన్ 21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం హరితహారం కార్యక్రమంపై కీసరలో జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా అధికారుల పనితీరు బాగుందని.. జిల్లాను అభివృద్ధి చేసి మంచిపేరు తీసుకొస్తున్నారని మంత్రి అభినందించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో పండ్లు, పూలనిచ్చే మొక్కలు నాటాలన్నారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కోరారు. కావాల్సిన వారికి మొక్కలు అందజేస్తామన్నారు.
అటవీ సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మేడ్చల్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి అన్నారు. అలాగే హరితహారంలో నాటిన మొక్కలకు జియోట్యాంగింగ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. మొక్కలు పెంచడంతో అటవీ సంపద పెరుగుతుందన్నారు. అధికారులకు పూర్తి సహకారం అందించి హరితహారాన్ని విజయవంతం చేస్తామన్నారు.
మేడ్చల్ జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులను భాగస్వామ్యులను చేసి లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు లు, చెత్త సేకరణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లో నిలుపాలన్నారు. అర్బన్ ప్రాంతాలలో 13 వెజ్-నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాన్నారు. ఇందుకు సంబంధించి భూ కేటాయింపులు పూర్తి అయ్యాయని వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు పల్లె నిద్రలో పాల్గొనాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న డంపింగ్ యార్డులు, వైకుంఠధామల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్కు మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా స్థాయి అధికారులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసిలు, ఎంపీపీలు పాల్గొన్నారు.