మేడ్చల్, జూలై31(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నది.పలువురు ప్రధానోపాధ్యాయులు అంగన్వాడీల ద్వారా విద్యార్థుల వివరాలను సేకరించి నేరుగా ఉపాధ్యాయ బృందాలు వారి ఇండ్లకే వెళ్లి అడ్మిషన్లను స్వీకరిస్తున్నారు. జిల్లాలో 505 ప్రభుత్వ పాఠశాలలో 1 వతరగతి నుంచి 10 వతరగతి వరకు 9718 మంది విద్యార్థులు ఇపపటి వరకు అడ్మిషన్లు పొందినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి ఎన్.ఎస్.ఎస్ ప్రసాద్ వెల్లడించారు. జూలై 8 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించామని విద్యార్థులను సర్కారు బడుల్లో చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ముందుకొస్తున్నారని ఆయన తెలిపారు. ఆన్లైన్ తరగతుల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరును రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 31 వరకు ఉండడంతో మరింత మంది విద్యార్థుల చేరే అవకాశం ఉంది.