మేడ్చల్, సెప్టెంబర్ 25 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొవిడ్ కారణంగా 18 నెలల పాటు పాఠశాలలకు దూరమైన విద్యార్థులను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు విద్యా శాఖ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికను మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 503 ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు ఈ నెల 27 నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. వారికి రెగ్యులర్ పాఠ్యాంశాలతో పాటు వెనుకబడిన సబ్జెక్టులను తిరిగి బోధించనున్నారు. ముఖ్యంగా ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచి పరీక్షలకు సిద్ధం చేయనున్నారు. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. పాఠశాలల పున: ప్రారంభం తర్వాత విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కొవిడ్ కారణంగా 18 నెలల పాటు చదువుకు దూరమైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ముఖ్యంగా ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులను బోధిస్తాం. జిల్లావ్యాప్తంగా ఈ నెల 27 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నాం. మేడ్చల్-మల్కాజిగిరి విద్యాశాఖ అధికారి ఎన్.ఎస్.ఎస్. ప్రసాద్