మేడ్చల్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వానాకాలం పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ఇప్పటికే అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అధికారులు రైతులకు అందుబాటులో ఉంచారు. మేడ్చల్ జిల్లాలో వానాకాలంలో (ఖరీఫ్) 23,173 ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగును చేపట్టే విధంగా వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరికి ప్రత్నామ్నాయంగా పత్తి, కంది సాగుకు సంబంధించి విస్తీర్ణం పెంచేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
వానాకాలం వివిధ పంటల సాగుకు అవసరమయ్యే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కొరత రాకుండా చూస్తాం. వరి పంటకు ప్రత్యామ్నాయంగా పత్తి, కందుల సాగుపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పిస్తున్నాం. – మేరీ రేఖ, వ్యవసాయాధికారిణి, మేడ్చల్ జిల్లా.