సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 5: మహనీయుల చరిత్రను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. బుధవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక కల్వకుంట రోడ్డులో నిర్వహించిన జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీచైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు అందాలని ఆకాంక్షించి, ఆ దిశగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.
కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశా జ్యోతి, గొప్ప ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. ఆయన చెప్పిన సూక్తులు మననం చేసుకుంటూ ఆయన బాటలో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయసాధకుడిగా, అణగారిని వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. హరిత విప్లవాన్ని తీసుకువచ్చిన గొప్ప ధీశాలి అని, ఆయన దూర దృష్టి ద్వారానే ఇప్పుడు ఆహార కొరత లేకుండా ఎగుమతులు చేస్తున్నామని కలెక్టర్ గుర్తు చేశారు. అభివృద్ధికి నాంది బాబూ జగ్జీవన్ రామ్ అని స్పష్టం చేశారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, చైతన్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందేలా చేయూతనిస్తూ అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు.
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ మహనీయులు సాధించిన విజయాలు, వారి ఆశయాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం అధికారికంగా మహనీయుల జయంతులను నిర్వహిస్తున్నదని అన్నా రు. ఆయన ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు వివిధ సంఘాల నా యకులు, ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, టీఎస్ఎస్ కళాకారుల కళాజాత కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి జగధీశ్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.