జహీరాబాద్, జూలై 6: జహీరాబాద్ మీదుగా బుల్లెట్రైలు నడిపించేలా కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ దక్షిత ప్రాంత ఎమ్మెల్యే శైలేంద్ర బెల్డలేను జహీరాబాద్ బుల్లెట్రైలు సాధన కమిటీ అఖిలపక్షం నాయకులు కోరారు. సోమవారం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో ఎమ్మెల్యే శైలేంద్ర బెల్డలే నివాసంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అధ్యక్షతన అఖిలపక్షం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్-ముంబాయికి జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు వెళ్లేలా సంబంధిత రైల్వేమంత్రిత్వశాఖ మొదటి విడత డీఆర్పీ అలైన్మెంట్లో రూపొందించారన్నారు.
రెండో విడత డీఆర్పీ అలైన్మెంట్లో జహీరాబాద్కు బదులుగా కోకపేట్, వికారాబాద్ మీదుగా బుల్లెట్రైలు నడిపించేలా ప్రతిపాదనలు చేశారని పేర్కొన్నారు. బుల్లెట్రైలు దారి మళ్లింపుతో నిమ్జ్, స్మార్ట్సిటీ రూపుదిద్దుకుంటున్న జహీరాబాద్, బీదర్ ప్రాంత అభివృద్ధికి తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రైల్వే ఉన్నతాధికారులను కలిసి జహీరాబాద్ ప్రాంతానికి బుల్లెట్ రైలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ మంత్రి, సంబంధిత రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి జహీరాబాద్ మీదుగా బుల్లెట్రైలు నడిపించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే శైలేంద్ర బెల్డలే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ రైలు అఖిలపక్షం నాయకులు , ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శికకుమార్, గుండ ప్ప, భాస్కర్, నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.