ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు.. పార్టీకి సారథులు యువతే అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ‘పార్టీ బలోపేతం-సమాలోచన’పై రాష్ట్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన విభాగం నాయకులతో మంత్రి సమీక్షించారు. యువజన విభాగం క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామ న్నారు. ఏమీ చేయకుండానే బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని చేస్తోందని, మనమంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని కోరారు.
సిద్దిపేట, జూలై 27 : కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలని,యువజన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో క్యాంపు కార్యాలయంలో బుధవారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ, టీఆర్ఎస్ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మండలంలో గ్రామ ప్రజాప్రతినిధులు, యువజన విభాగం నాయకులతో టీఆర్ఎస్ బలోపేతంపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నకోడూరు మండ లం, గ్రామాల్లో యువజన విభాగం క్రియాశీలకంగా పని చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. అన్ని సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని, ఎరువులు, యూరియా ధరలు పెంచిన విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలన్నారు. బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతియేటా పెట్టుబడి సాయం కింద రైతుబంధు, రైతుబీమా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే, బీజేపీ రైతును ముంచే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
అభద్రతా భావం వీడి.. ఆత్మవిశ్వాసంతో జీవించండి
ఇండ్లు కొనుగోలు చేసి ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు శాశ్వత పట్టా లభించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న 170 మంది అర్హులైన లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ చేసిన ఇండ్ల పట్టా పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తరపున యాజమాన్య హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణ పట్టాలు అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ కాలనీలో ఇండ్ల వాసులు ఏ కార్యాలయం చుట్టూ తిరిగే అవసరం లేకుండా తామే దగ్గరుండి క్రమబద్ధీకరణ పట్టాలు ఇప్పించేలా చొరవ చూపామని, ప్రజలకు భద్రత, భరోసా, ధీమా కల్పించాలన్నదే తన తపన అని మంత్రి అన్నారు. పట్టాతో పాటు ఇంటి నంబరు, నల్లా కనెక్షన్, కరెంట్ మీటరు పత్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి ఇవ్వాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరామ్, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్రెడ్డి, వార్డు కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, తహసీల్దార్ విజయ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కుల సంఘం భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీక
సిద్దిపేట అర్బన్, జూలై 27 : కుల సంఘం భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలానికి చెందిన ఆరు గ్రామాల్లోని కుల సంఘం భవనాలకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల సంఘం భవనాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కుల సంఘం భవనాలు నిరుపేదలకు శుభకార్యాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడుతాయన్నారు. నంగునూరు మండలంలోని అక్కెనపల్లి గ్రామ యాదవ కమ్యూనిటీ హాల్కు రూ.10 లక్షలు, ఖానాపూర్ గ్రామ పీర్ల కొట్టానికి రూ.7 లక్షలు, కొండంరాజ్పల్లి యాదవ కమ్యూనిటీ హాల్కు రూ.7 లక్షలు, అప్పలాయ చెరువు ముదిరాజ్ కమ్యూనిటీ హాల్కు 5 లక్షలు, రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్కు రూ.5 లక్షలు, గట్లమల్యాల గొర్రెల హాస్టల్కు రూ.10 లక్షలు, తిమ్మాయిపల్లిరెడ్డి సంఘానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.54 లక్షలు కుల సంఘం భవనాల ప్రొసీడింగ్ కాపీలను ఆయా సంఘం ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు.్ర
శావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
సిద్దిపేట వేంకటేశ్వస్వామి, సంతోషిమాత ఆలయాల్లో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా మంత్రి హరీశ్రావుకు ఆలయ నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మించే ధ్యాన మందిర పనులు ప్రారంభించాలన్నారు. వేంకటేశ్వరస్వామికి సమర్పించే బంగారు కిరీటం నిధులు సమకూర్చాలన్నారు. వచ్చే నెల 5,6,7 తేదీల్లో సంతోషిమాత దేవాలయంలో జరిగే శ్రావణ మాస ఉత్సవాలు వేడుకగా నిర్వహించాలన్నారు. అన్నదాన సత్రాన్ని ప్రారంభించుకుందామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు మాంకాల నవీన్, అమరేశ్విష్ణు, ట్రస్టు సభ్యులు అయిత పురుషోత్తం, రమణమ్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి విశ్వనాథం, అర్చకులు కృష్ణమాచారి, వెంకటచారి, వీరేశం, గ్యాదరి కృష్ణ, కాముని ప్రభాకర్ పాల్గొన్నారు.