ములుగు, జూలై 29 : ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శనివారం ప్రపంచ పులుల దినోవ్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణ ప్రధానాధికారి డోబ్రియల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో తెలంగాణలో పులుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు పర్యావరణ పరిరక్షణకు ముప్పుగా మారాయని, ఉన్న అడవుల సంరక్షణ దీనికి పరిష్కారమార్గమని అన్నారు.
అడవుల సంరక్షణలో పులుల ప్రాధాన్యతే కీలకమన్నారు. పులులను మనం కాపాడితే అవి అడవిని, మనుషులను కాపాడుతాయన్నారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రాజెక్టు టైగర్ కార్యక్రమం సత్పలితాన్నిస్తుందని, ప్రస్తుతం దేశంలో 3,167 పులులు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రభావిత గ్రామాల పరిసరాల్లో జంతువులు, మనుషుల మధ్య జరిగే సంఘర్షణను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ, పులుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ట్రైనీ అటవీ సిబ్బందికి వివరించారు. 400 మంది ట్రైనీ అటవీ సిబ్బంది, అటవీ కళాశాల విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టైగర్దీమ్ పేరిట పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
పర్యావరణవేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం : అటవీ కళాశాల డీన్ ప్రియాంక వర్గీస్
భవిష్యత్తులో పర్యావరణవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ కళాశాలను ఏర్పాటు చేశారని అటవీ కళాశాల డీన్ ప్రయాంక్ వర్గీస్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరుకు ‘గ్లోబల్ టైగర్ డే’ వేడుకలను అటవీ కళాశాలలో నిర్వహించామని ఇది అటవీ సిబ్బందికి, అటవీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించాలని కోరారు. కార్యక్రమంలో విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూసింగ్ మేరు, అడిషనల్ పీసీసీఎఫ్ వినయ్కుమార్, సీపీఎఫ్ సైదులు, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ఆశ, అటవీ కళాశాల అధికారులు శ్రీనివాస్రావు, వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.