జహీరాబాద్, డిసెంబర్ 22: కార్పొరేట్ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రోత్సహిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు సాగు చేసే పంటలు కనుమరుగయ్యాయని పలువురు మహిళా రైతులు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ‘చిరుధాన్యాలతో ఆహార సార్వభౌమత్యం’పై నిర్వహించిన సమావేశానికి సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, యాదాద్రి జిల్లాల నుంచి మహిళా రైతులు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వాతావరణ మార్పులకు అనుగుణంగా కొత్త విత్తనాలు ఉత్పత్తి చేసి రైతులకు అందించాలన్నారు. మార్కెట్లో చిరుధాన్యాలకు ధర ఉన్నా సరైన దిగుబడి లేదని చెప్పారు. చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. భూసార పరీక్షలు ప్రతి ఏడాది చేయాలన్నారు. తెల్ల కుసుమ సాగును పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న పిల్లలకు చిరుధాన్యాలతో ఆహారం అందించాలని కోరారు. పత్తి, వరి సాగును తగ్గించాలని, రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పలురకల చిరుధాన్యాల పంటలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో డీడీఎస్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణీరావు, ప్రముఖ జర్నలిస్టులు కె.సజేయ, రమేశ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిమ్మయ్య, అమరేంద్ర, జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారసత్వ పంటలైన చిరుధాన్యాల సాగును పెంచేందుకు కృషి చేయాలి. ప్రజా పంపిణీలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జొన్న, సజ్జ, రాగి, అరికెలు, కొర్ర, కొడిసమ, వరిగి మొదలైన చిరుధాన్యాలకు మద్దతు ధర కల్పించాలి.
అంతరపంటగా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి. అవి పండించే రైతులకు రైతు బంధులో రూ.10 వేలు ఆర్థిక సహకారం బోనస్గా ఇవ్వాలి. చిరుధాన్యాల కొనుగోలుకు గ్రామాల్లో కమిటీ వేసి చిరుధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను అందించాలి.
కొనుగోలు చేసిన చిరుధాన్యాలను ఐసీడీఎస్ పథకం ద్వారా అంగన్వాడీలు, పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు భోజనం రూపంలో అందించాలి.
పంటల బీమా పథకంలో చిరుధాన్యాలను చేర్చాలి. వాతావరణ మార్పులతో నష్టపోతోనే పరిహారం అందించాలి. వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించాలి.
పంటల దిగుబడి పెంచేందుకు కొత్తరకం విత్తనాలు ఉత్పత్తి చేయాలి. స్థానికంగా ఎన్నో తరాలుగా మహిళా రైతులు కాపాడుతున్న విత్తన రకాలను చెరిపే ప్రయత్నం చేయవద్దు. జీవవైవిద్య పంటలను కాపాడాలి. విత్తన బ్యాంకులు ఏర్పాటు చేయాలి.
వాతావరణ మార్పులకు తట్టుకోనే విత్తనాలు ఉత్పత్తి చేయాలి. పశు సంపదను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలి. వలస పక్షులు, అడవి జంతువుల నుంచి పంటలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి.