పటాన్చెరు, ఏప్రిల్ 12: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ శుక్రవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డే) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందజేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో దాదాపు 180 దేశీయ, బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ గీతం వర్సిటీలో ప్రాంగణ నియామకాలను నిర్వహించాయి. ఇందులో ఇప్పటి వరకు 150 కంపెనీలు బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బీ ఫార్మసీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ విద్యార్థులను ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు తెలిపాయి. కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుని, దేశవిదేశాలల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశార్హత సాధించినట్టు తెలిపారు. టెక్నాలజీ విద్యార్థులు రూ.15లక్షల వార్షిక వేతనం, మేనేజ్మెంట్ విద్యార్థులు రూ. 14.13 లక్షలు, సైన్స్ విద్యార్థులు రూ. 7.50 లక్షల చొప్పున గరిష్ట వార్షిక వేతనాలకు ఎంపికైనట్టు తెలిపారు.
మొత్తం గీతం మేనేజ్మెంట్ విద్యార్థులు రూ. 7.50 లక్షలు, టెక్నాలజీ విద్యార్థులు రూ. 5.18 లక్షల సగటు వార్షిక వేతనాన్ని పొందినట్టు తెలిపారు. బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థి రీతి దత్తా చౌదరి, ఐఐటీ జాయింట్ అడ్మిషన్స్ (జేఏఎం-2024)లో 333వ ర్యాంకు సాధించి, జాతీయస్థాయిలో గీతం విద్యార్థుల ప్రతిభా సామర్ధ్యాన్ని చాటి చెప్పింది. ఓ విద్యార్థి మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్కు ఎంపికై మొదట్లో రూ.1.25లక్షల సీటీసీని పొందగా, ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తయ్యాక రూ. 50లక్షల సీటీసీ పొందనున్నట్టు పేర్కొన్నారు. మరో ఇద్దరు విద్యార్థులు రూ. 50వేలతో ఇంటర్న్షిప్ పొందినట్లు చెప్పారు. కార్యక్రమంలో యాక్సెంచర్ టాలెంట్ ఆక్విజిషన్ ఉపాధ్యక్షుడు అమిత్ సిన్హా, ఎంపీహెచ్ఏఎస్ఐఎస్ ఇండియా క్యాంపస్ లీడ్ జాషువ డేవిడ్, అరబిందో ఫార్మా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అన్షుమన్ శరన్ పాల్గొన్నారు.